సిటీబ్యూరో, జూలై 21(నమస్తే తెలంగాణ): గ్రేటర్ ఓటర్లు తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవడమే ధ్యేయంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం), ఓటర్ వెరిఫికేషన్ పేపర్ ఆడిట్ ట్రయల్లపై నియోజకవర్గ స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో సంచార వాహనాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గ స్థాయిలో ఈవీఎం, వీవీ ప్యాట్ల్తో పలు ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. రాబోయే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి ఆయా నియోజకవర్గ స్థాయి ఎలక్ట్రోల్ అధికారులను ఆదేశించారు.
ఎలక్ట్రానిక్ యంత్రాల ద్వారా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు అబిడ్స్ డిప్యూటీ కమిషనర్, నల్గొండ క్రాస్రోడ్ డీసీ ఆఫీస్, అబిడ్స్, జూబ్లీహిల్స్ డీసీ కార్యాలయాలు, బేగంపేట, మారేడ్పల్లి, మెహిదీపట్నం, గోషామహల్, మొఘల్పుర, చార్మినార్, హఫీజ్బాబా నగర్, సికింద్రాబాద్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయాల్లో ఈవీఎం, వీవీ ప్యాట్లతో పాటు డెమో స్టేషన్లను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. ఒక్కొక్క సెంటర్కు ఒక అధికారిని ఇన్ఛార్జిగా నియమించి ఓటర్లకు ఎలక్ట్రానిక్ యంత్రాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ అవగాహన కార్యక్రమాలు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు.