బన్సీలాల్పేట్, జనవరి 10 : మొబైల్ ఫోన్లలో వచ్చే మోసపూరిత ప్రకటనలు, లాటరీ వచ్చిందని, వడ్డీ లేకుండా లోన్ తీసుకోమంటూ డబ్బు ఆశ చూపించే లింక్లు, స్కానర్లను నమ్మవద్దని గాంధీనగర్ పోలీసులు హెచ్చరించారు. ఇటీవల పెరిగిన ‘సైబర్ క్రైమ్స్’ గురించి బోయిగూడలోని ఐడీహెచ్ కాలనీలో బుధవారం స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఏఎస్ఐ కే.నర్సింహ మాట్లాడుతూ.. తాము డబ్బు మోసపోయినట్లుగా గుర్తిస్తే వెంటనే 100 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. లేదా సమీప పీఎస్లో ఫిర్యాదు చేయాలన్నారు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని, ఈ రోజుల్లో వాటి అవసరం కూడా అంతే ముఖ్యమన్నారు.
కనీస అవగాహన లేకుంటే తమ బ్యాంకు ఖాతాల నుంచి సొమ్మును మోసగాళ్లు కొట్టేస్తారని, అందుకే యూపీఐ యాప్లు వాడకంపై, బ్యాంకు లావాదేవిల గురించి తెలుసుకోవాలని ఆయన అన్నారు. వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వివరాలు, ఆధార్, పాన్, పాస్వర్డ్లను ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి చెప్పవద్దని ఆయన సూచించారు.