కొండాపూర్, మార్చి 6: ఉక్రెయిన్-రష్యా యుద్ధ సమయంలో ఆపరేషన్ గంగా ద్వారా భారతదేశానికి తిరిగొచ్చిన నియో -జెడ్ఎస్ఎం యూనివర్సిటీ ఎన్ఈఓ ఇనిసిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విద్యార్థు లు పట్టభద్రులయ్యారు. వీరిలో 72 మంది విద్యార్థులు ఎన్ఎంసీ రిజిస్ట్రేషన్ కోసం ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ స్క్రీనింగ్ పరీక్షలో (ఎఫ్ఎంజీఈ) ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు సోమవారం గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ (ఏఐజీ) దవాఖాన ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన 2022 గ్రాడ్యుయేషన్, సక్సెస్ మీట్లో పట్టాలను కేంద్ర మంత్రి ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక,ఈశాన్య రాష్ర్టాల అభివృద్ధి మంత్రి జీ.కిషన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డితో కలిసి విద్యార్థులకు పట్టాలను, ఎఫ్ఎంజీఈ పాస్పై బంగారు పతకాలు, కొవిడ్ వారియర్, ఎవాక్యుయేషన్ బ్రేవరీ అవార్డులతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ కావాలన్న ఆకాంక్షతో చాలా మంది మధ్య తరగతి విద్యార్థులు విదేశాల్లో ఎంబీబీఎస్ చదివేందుకు విదేశాలకు వెళ్తున్నారన్నారు.
ఇదే క్రమంలో ఉక్రెయిన్కు వెళ్లిన విద్యార్థులను రష్యా- ఉక్రెయిన్ యుద్ధం సమయంలో ఆపరేషన్ గంగా పేరిట అక్కడున్న భారతీయులను వెనక్కి తీసుకువచ్చినట్లు తెలిపారు. మధ్యలోనే మెడికల్ విద్యను వదిలి దేశానికి తిరిగి వచ్చిన విద్యార్థులకు ఇక్కడ విద్యను పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎఫ్ఎంజీఐ పరీక్షలను అధిక సంఖ్యలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశంలో వైద్యుల కొరత రాకుండా మెడికల్ కాలేజీలతో పాటు సీట్ల పెంపునకు కృషి చేసినట్లు తెలిపారు.కార్యక్రమంలో విజయబాబు, డాక్టర్ దివ్య రాజిరెడ్డి, డాక్టర్ రాజ్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.