సిటీబ్యూరో, డిసెంబరు 13 (నమస్తే తెలంగాణ): చట్టం అందరికీ సమానం.. అందరికీ ఒకే రకమైన నియమ నిబంధనలు అమలయ్యేలా చూస్తాం.. ప్రజలకు పూర్తి భద్రతతో కూడిన సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేస్తాం.. అని సైబరాబాద్ నూతన సీపీ అవినాష్ మహంతి అన్నారు. బుధవారం సైబరాబాద్ పోలీసు కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం మహంతి మీడియాతో మాట్లాడుతూ.. సైబరాబాద్ పరిధిలో పలు రాష్ర్టాల ప్రజలతో పాటు విదేశీయులు కూడా నివసిస్తారని, రాకపోకలు సాగిస్తారని తెలిపారు.
ఇక్కడ ప్రముఖ ఐటీ కంపెనీలతో పాటు ఇతర పారిశ్రామిక సంస్థలు కూడా ఉన్నాయని, వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు పూర్తి భద్రతతో కూడిన సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. పోలీసు వ్యవస్థలో ఉన్న సాంకేతిక, మానవ వనరులన్నింటినీ ఉపయోగించుకుని, ప్రజలకు అవసరమైన సేవలందిస్తామన్నారు. సైబర్ నేరాలు పెరుగుతున్న దృష్ట్యా వాటి నివారణతో పాటు కేసులను ఛేదించడంపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రజలతో స్నేహంగా మెలుగుతూనే నేరగాళ్ల పాలిట కఠినంగా వ్యవహరిస్తామని మహంతి తెలిపారు. అంతకు ముందు సైబరాబాద్ పాత సీపీ స్టీఫెన్ రవీంద్ర తన బాధ్యతలను అవినాష్ మహంతికి అప్పగించారు. ఈ సందర్భంగా స్టీఫెన్ మాట్లాడుతూ.. ప్రజలు, తోటి అధికారులు, సిబ్బంది సహాయ సహకారాలతో విజయవంతంగా విధులు నిర్వహించగలిగానన్నారు.