కవాడిగూడ, మే 5: ఎన్నికల సందర్భంగా ఆటో డ్రైవర్లకు సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి, ఆటో టాక్సీ డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంటయ్యగౌడ్ డిమాండ్ చేశారు. ఆటో ప్రైవేట్ రవాణా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద మంగళవారం మహాధర్నా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన రవిశంకర్ అల్లూరి, పెంటయ్యగౌడ్ మాట్లాడుతూ ఆటో ప్రైవేట్ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. లేనట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ ప్రభుత్వం డ్రైవర్ల సమస్యలను విస్మర్మించడం దారుణమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా కొనసాగుతుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంతో ఆటోడ్రైవర్ల ఉపాధి దెబ్బతిని ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక కుటుంబాలను పోషించడం భారంగా మారి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.
సొంత ఇళ్లు లేని డ్రైవర్లకు డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీధర్రెడ్డి, ఆటోయూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చింతల నందకిశోర్, టీఎస్పీటీ టీఎంఎం రాష్ట్ర అధ్యక్షుడు లికిత్కుమార్, ఉపాధ్యక్షులు హబీబ్, క్యాబ్ యూనియన్ నాయకులు మీనా, సంతోష్, అశ్విన్రాజ్, శ్రీనివాస్ముదిరాజ్, మహేశ్, జహంగీర్, సంతోష్, వెంకటేశ్, రాములు, రమేశ్, వజ్రలింగం, మహేందర్, ఆంజనేయులు పాల్గొన్నారు.