సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): సీజ్ చేసిన వాటిలో, ఎవరు క్లెయిమ్ చేయని 1096 వాహనాలను 15వ విడతలో హైదరాబాద్ పోలీసులు బహిరంగ వేల వేశారు. గోషామహాల్ పోలీస్స్టేడియంలో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పర్యవేక్షణలో వేలం కమిటీ చైర్మన్ సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ ఆధ్వర్యంలో బహిరంగ వేలం నిర్వహించారు. ఏపీ, తెలంగాణ రాష్ర్టాలకు చెందిన 550 మంది వేలం పాటలో పాల్గొన్నారు.
ఇందులో 1031 ద్విచక్ర, 24 త్రి వీలర్, మూడు ఫోర్ వీలర్ వాహనాలు తుక్కు కింద వేలం వేయగా రూ. 70,25,500, మరో 38 వాహనాలకు రూ. 6.3 లక్షలు, మరో మూడు వాహనాలు వేలంలో తిరస్కరణకు గురయ్యాయని అధికారులు తెలిపారు. 1093 వాహనాల వేలంతో రూ. 76.55 లక్షలు ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యాయని వివరించారు. ఈ వేలం కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ కరుణాకర్, ప్లేట్ల బురుజు సిటీ పోలీస్ శిక్షణ సంస్థ ప్రిన్సిపాల్, అదనపు డీసీపీ మద్దిపాటి శ్రీనివాస్రావు పాల్గొన్నారు.