కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 29: నాలుగున్నరేండ్లు జైలు జీవితం గడిపాడు. అయినా.. అతడి బుద్ధిమారలేదు. తిరిగి నేరాల బాటనే ఎంచుకున్న ఆ వృద్ధుడు పోలీసులకు చిక్కి.. కటకటాల పాలయ్యాడు. అతడి వద్దనుంచి రూ.ఐదు లక్షల విలువజేసే హాషీష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి ప్రాంతానికి చెందిన శంకర్రావు (71) గురువారం దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలోని గండిమైసమ్మ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. అక్కడే ఉన్న మేడ్చల్ ఎస్ఓటీ పోలీసుల కంటపడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. అతడి వద్ద లభించిన ఓ స్వీట్బాక్స్లో సుమారు రూ.5 లక్షల విలువజేసే హాషీష్ ఆయిల్ బయటపడింది.
అదుపులోకి తీసుకొని విచారించగా.. 2019, మార్చి 1న రాజేంద్రనగర్ ఔటర్ రింగ్రోడ్ వద్ద ఎస్సీబీకి 744.2 కిలోల గంజాయితో పట్టుబడ్డాడు. దీంతో అతడిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించగా దాదాపు నాలుగున్నరేండ్లు జైలు జీవితం గడపాడు. బయటకు వచ్చిన తర్వాత బుద్దితో ఉండాల్సిన అతడు తిరిగి నేరాల బాటనే ఎంచుకొని కటకటాలోకి వెళ్లాడు. నిందితుడిని, అతడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న హాషీష్ ఆయిల్ను ఎస్ఓటీ పోలీసులు తదుపరి దర్యాప్తు నిమిత్తం దుండిగల్ పోలీసులకు అప్పగించారు.