బంజారాహిల్స్ : బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని శ్రీరాంనగర్ బస్తీలో సుమారు 800 గజాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ఆక్రమించేందుకు యత్నించగా రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే శ్రీరాంనగర్లోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం సమీపంలో సుమారు 800గజాల స్థలం ఖాళీగా ఉంది.
ఈ స్థలం యూఎల్సీ పరిధిలోకి వస్తుండడంతో చాలా కాలంగా ఇక్కడ ప్రభుత్వ హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. అయితే సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు అక్కడకు వచ్చి జేసీబీ సాయంతో స్థలాన్ని చదును చేసేందుకు పనులు ప్రారంభించడంతో పాటు హెచ్చరిక బోర్డును తొలగించారు.
ఈ విషయాన్ని స్థానికులు షేక్పేట మండల తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ సిబ్బందిని పంపించారు. రెవెన్యూ సిబ్బంది రాకను గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు జేసీబీతో సహా అక్కడినుంచి ఉడాయించారు. ఈ స్థలాన్ని ప్రభుత్వ పాఠశాల కోసం కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు.