సిటీబ్యూరో, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : సులభంగా డబ్బులు సంపాదించాలి… కష్టపడే తత్వం ఉన్నప్పటికీ, డబ్బును తేలికగా పోగు చేసుకోవాలన్న అత్యాశతో చోరీలకు అలవాటు పడుతూ నిత్యం జైలునే ఇళ్లుగా మార్చుకుంటున్నారు కొందరు నేరస్తులు. ఈ క్రమంలో జైలుకు వెళ్తున్న నేరస్తుల కుటుంబాలు మాత్రం నిత్యం నరకాన్ని అనుభవిస్తున్నాయి. ఈ పరిస్థితుల నుంచి నేరగాళ్లు, వాళ్ల కుటుంబాలను సమాజంలో తలెత్తుకునే విధంగా చేసేందుకు రాచకొండ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేరస్తులు నేరాల బాట పట్టకుండా, సభ్య సమాజంలో కష్టపడి పని చేసుకోవడంతో పాటు మెరుగైన జీవనాన్ని కలిగించేలా ‘మార్పు కోసం ముందడుగు’ పేరుతో రాచకొండ క్రైమ్స్ డీసీపీ పరవస్తు మధుకర్స్వామి నేతృత్వంలో ఓ నూతన కార్యక్రమాన్ని తలపెట్టారు. నేరస్తులు మరోసారి చోరీల బాట పట్టకుండా ఉండేందుకు రాచకొండ పోలీసులు తీసుకుంటున్న చర్యలపై సర్కారు సైతం చేయూతనిస్తుంది.
స్వయం ఉపాధి కల్పించే దిశగా..
మార్పు కోసం ముందడుగు కార్యక్రమంలో భాగంగా రాచకొండ క్రైమ్స్ డీసీపీ పరవస్తు మధుకర్ స్వామి నేతృత్వంలో నిర్వహించిన తొలి విడతలో భాగంగా రాచకొండలోని 9 పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 318 మంది నేర చరిత్ర ఉన్న వ్యక్తులను గుర్తించారు. వారి ఆర్థిక, జీవన, కుటుంబ స్థితిగతులు, ఆరోగ్య వివరాలన్నీ తెలుసుకుని, పూర్తిగా నేరాలు మానేసి కొత్త జీవితాన్ని ప్రారంభించేలా మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించారు. రెండో విడతలో భాగంగా శనివారం ఎల్బీనగర్ పరిధిలోని కుషాల్ గార్డెన్లో నిర్వహించిన ‘మార్పు కోసం ముందడుగు’ కార్యక్రమంలో రాచకొండ పరిధిలోని మహేశ్వరం, ఎల్బీనగర్ జోన్లలోని 14 పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు 400 మంది నేర చరిత్ర ఉన్న వ్యక్తులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. వారి స్వయం ఉపాధి కోసం లయన్స్ క్లబ్ గ్రీన్ల్యాండ్స్ హైదరాబాద్ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి పలు అంశాల్లో శిక్షణనిచ్చేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. దీంతో పాటు పోలీస్ శాఖ అధ్వర్యంలో నేరస్తులకు పిల్లలుంటే వారికి గురుకులాల్లో ప్రవేశాలు ఇప్పించేలా చర్యలు తీసుకుంటుంది. అదే విధంగా ఎక్కువ మంది నేరస్తులు గంజాయి, మద్యం వ్యసనాలతో సతమతమవుతుంటే వారిని ప్రముఖ మానసిక వైద్యులతో కౌన్సెలింగ్ ఇప్పించేలా ముందడుగు వేస్తున్నారు. పలువురు వక్తలు నేరస్తులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం నేరస్తులతో రాచకొండ పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో లయన్స్ క్లబ్ గ్రీన్ల్యాండ్స్ హైదరాబాద్ అధ్యక్షురాలు డాక్టర్ లక్ష్మీకుమారి, ఆకెళ్ల రాఘవేంద్ర, రాజ్కుమార్, రఘునాథ్రెడ్డి, ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, అడిషనల్ డీసీపీ లక్ష్మి, ఎల్బీనగర్, వనస్థలిపురం, ఏసీపీలు శ్రీధర్రెడ్డి, పురుషోత్తంరెడ్డితో పాటు ఫింగర్ ప్రింట్ విభాగం ఎసీపీ నందుకుమార్, ఆయా పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సమాజాభివృద్ధికి తోడ్పడాలి
నేరాలకు దూరంగా ఉంటూ మంచి ప్రవర్తనతో తమ కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధికి తోడ్పాటునందించాలి. లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ల్యాండ్స్ హైదరాబాద్ సంస్థ ద్వారా మార్పు కోసం పురుషులు , మహిళలకు ఉచితంగా పలు రంగాల్లో అవకాశం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. పురుషుల ఉపాధి కోసం డ్రైవింగ్, మెకానిక్తో పాటు వృత్తి నైపుణ్య శిక్షణలు, మహిళలకు కుట్టుమిషన్తో సహా పలు అంశాలపై శిక్షణనివ్వడం, ఉపాధి కల్పించడం జరుగుతుంది. క్షణికావేశంలో చేసే చిన్న పొరపాటు మనతో పాటు సమాజంపై దుష్పప్రభావం చూపుతుంది. ఇప్పటికైనా నేరాల బాట వదిలి మెరుగైన జీవనం వైపు అడుగులు వేయాలి.
– ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మీకుమారి, అధ్యక్షురాలు, లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ల్యాండ్స్ హైదరాబాద్
మార్పు తెచ్చేందుకు యత్నిస్తున్నాం
ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులు, సులభంగా డబ్బులు సంపాదించవ్చనే కారణమో, ఇతర సమస్యలతో తెలిసోతెలియకో చోరీల బాట పట్టి జైలు జీవితం గడుపుతారు. ఈ క్రమంలోనే పాత నేరస్తులను గుర్తించి వారిలో మార్పు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నాం. ఐదేండ్లకు మించి నేరాలకు పాల్పడకుంటే కచ్చితంగా అధికారులతో మాట్లాడి నేర చరిత్ర తొలగించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. నేరస్తుల్లో మార్పు తీసుకురావడానికి ప్రత్యేకంగా ‘మార్పు కోసం ముందడుగు’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. త్వరలోనే రాచకొండ వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి నేరాల బాట పట్టకుండా వారిలో మార్పుకు ప్రయత్నం చేస్తున్నాం.
– పరవస్తు మధుకర్స్వామి, డీసీపీ, రాచకొండ క్రైమ్స్
నేరస్తుల్లో పరివర్తన తెచ్చేలా రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్
సమావేశంలో రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ మాట్లా డుతూ.. చెడు లక్షణాలను దూరం చేసి మంచి నడవడికతో ముందడుగు వేయడంతో పాటు పరివర్తన తెచ్చే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. గతంలో నేరాలకు పాల్పడిన వారు నేరాలకు దూరంగా ఉంటూ ప్రస్తుత సమాజంతో నవజీవనాన్ని గడుపుతూ హుందాగా జీవించాల్సిన అవసరం ఉన్నదన్నారు. నేరస్తులు తొందరపాటుతో నేరాలు చేసినా సరే తప్పు చేయని వారి కుటుం బం కూడా దాని వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుందన్నారు. గతాన్ని మరిచిపోయి మారిన మనసుతో ముందడుగు వేయాలని, అందులో వారి కుటుంబ పాత్ర చాలా ముఖ్యమని తెలిపారు.