అడ్డగుట్ట, జూన్ 20 : పెండ్లి పత్రికలో పేర్లు ముద్రించలేదని మొదలైన గొడవ కత్తిపోట్లకు దారి తీసింది. ఈ ఘటన తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎల్లప్ప తెలిపిన వివరాల ప్రకారం.. మూడు రోజుల కిందట సికింద్రాబాద్లోని ఆజాద్ చంద్రశేఖర్నగర్కు చెందిన సురేశ్ వివాహం సుష్మతో జరిగింది. పెండ్లి పత్రికలో తమ తల్లిదండ్రుల పేర్లు పెట్టలేదని, అదే ప్రాంతానికి చెందిన సర్వేశ్ (20), చంద్రశేఖర్ (25)లు తమ బంధువులైన బాలమణి (సురేశ్ సోదరి) కుటుంబ సభ్యులతో గొడవకు దిగారు. గొడవ పెద్దదవుతుండటంతో బంధువులందరూ సర్దిచెప్పి వారిని పంపించారు. ఇదిలా ఉండగా తన కుటుంబ సభ్యులు, పెండ్లికి వచ్చిన బంధువులతో కలిసి బాలమణి ఆదివారం సర్వేశ్ ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో తిరిగి పెండ్లి పత్రికలో పేర్ల విషయంలో గొడవ వాగ్వాదం మొదలైంది. ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి లోనైన సర్వేశ్, చంద్రశేఖర్లు తమ ఇంటికి వచ్చిన బంధువులపై రెచ్చిపోయారు. సర్వేశ్ ఇంట్లో ఉన్న కత్తితో బాలమణి బంధువులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. చంద్రశేఖర్ సైతం అదే కత్తితో వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ప్రవీణ్ (30), పరుశురాం (35), యాదగిరి (42), ప్రతాప్కుమార్ (32)లు తీవ్రంగా గాయపడ్డారు. గాయాలతోనే వారు పోలీస్ స్టేషన్కు పరుగులు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, గాయపడిన వారిని ఉస్మానియా దవాఖానకు తరలించారు. నిందితులు పరారీలో ఉన్నారు.