హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివార్లలోని దుండిగల్లో శనివారం సాయంత్రం భారీ చోరీ జరిగింది. ఏటీఏం కేంద్రాలకు డబ్బును తరలించే వాహన డ్రైవర్ రూ. 36 లక్షల నగదుతో పరారీ అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. బేగంపేటకు చెందిన రైటర్స్ సంస్థ సిబ్బంది హైదరాబాద్తో పాటు శివార్లలోని పలు ఏటీఏం కేంద్రాల్లో నగదు జమ చేస్తుంటారు. అయితే ఈ సంస్థలో 20 రోజుల క్రితమే సాగర్(25) అనే వ్యక్తి డ్రైవర్గా చేరారు.
శనివారం మధ్యాహ్నం టీఎన్09 సీవై 3354 నంబర్ గల వాహనంలో రూ. 64 లక్షల నగదుతో కస్టోడియన్లు నితిన్, రంజిత్, గన్మెన్ బాబు, డ్రైవర్ సాగర్ కలిసి రైటర్స్ సంస్థ నుంచి బయల్దేరారు. జీడిమెట్లలోని యాక్సిస్ బ్యాంకులో రూ. 13 లక్షల జమ చేశారు. అక్కడ్నుంచి నేరుగా దుండిగల్ సాయిబాబా నగర్లోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎం వద్దకు సరిగ్గా మధ్యాహ్నం 3:30 గంటలకు చేరుకున్నారు. వాహనంలో నుంచి రూ. 15 లక్షలు తీసుకొని ఏటీఎం వద్దకు వెళ్లారు.
డ్రైవర్ సాగర్ మాత్రం వాహనంలో ఉండిపోయాడు. యూ టర్న్ తీసుకుని వస్తానని గన్మెన్కు చెప్పి వెళ్లిపోయాడు. ఎంతసేపటికి సాగర్ తిరిగి రాలేదు. అతని ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వచ్చింది. అనుమానం వచ్చి కస్టోడియన్లు, గన్ మెన్ కలిసి దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ. 36 లక్షల నగదుతో డ్రైవర్ సాగర్ పారిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సాగర్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నర్సాపూర్ రోడ్డులో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నగదు ఉన్న బ్యాగుతో సాగర్ పరారీ అయ్యాడు.