Hunger Strike | సుల్తాన్ బజార్, మార్చి 14: సీఎం రేవంత్ పాలన కంటే మాజీ సీఎం కేసీఆర్ పాలన ఎంతో ఉత్తమం అని నిరుద్యోగ అభ్యర్థులు అన్నారు. టెట్, మెగా డీఎస్సీ, గురుకులాలలో అన్ని పోస్టులకు గాను నోటిఫికేషన్లను వెంటనే వేయాలని డిమాండ్ చేస్తూ అశోక అకాడమీ చైర్మన్ అశోక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ దీక్ష గురువారంతో ఐదో రోజుకు చేరింది. నిరుద్యోగ అభ్యర్థుల జీవితాలలో వెలుగులు చూడాలని గత ప్రభుత్వాన్ని దింపి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిస్తే తమకు ఒరిగిందేమీ లేదని అశోక్ను పరామర్శించేందుకు వచ్చిన నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ను పరామర్శించేందుకు వచ్చిన నిరుద్యోగ అభ్యర్థులపై పోలీసులు దాడి చేయడాన్ని అభ్యర్థులు తీవ్రంగా ఖండించారు.
ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కళ్ళు కాయలు కాస్తూ చూస్తున్న తమలాంటి అభ్యర్థులకు ఈ ప్రభుత్వంలోనూ నిరాశే ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, నిరుద్యోగ అభ్యర్థులను కానిస్టేబుళ్లు పిడిగుద్దులు, విచక్షణారహితంగా కొట్టడంతో దెబ్బలు తీవ్రంగా తగిలి రక్త స్రావం అయ్యాయని వారు పేర్కొన్నారు. కేవలం పరామర్శించేందుకు వచ్చిన తమపై పోలీసులు దాడి చేయడాన్ని నిరుద్యోగ అభ్యర్థులు తీవ్రంగా ఖండించారు. కాగా, చైతన్యపురిలోని తన నివాసంలో నిరుద్యోగులతో కలిసి ఆమరణ నిరాహార దీక్షను చేస్తున్న అశోక్ను బలవంతంగా పోలీసులతో మంగళవారం అర్ధరాత్రి ఉస్మానియాకు వైద్య చికిత్సల నిమిత్తం తరలించారు.
ఉస్మానియా దవాఖానలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ను పరామర్శించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు తరలి వచ్చారు. కాగా, ఉస్మానియా కులీకుతుబ్ షా బ్లాక్లోని నాల్గవ అంతస్థులో చికిత్స పొందుతున్న అశోక్ను పరామర్శించే సమయంలో అక్కడే కానిస్టేబుళ్లు నిరుద్యోగ అభ్యర్థులపై దాడి చేయడంతో దెబ్బలు బలంగా తగిలి రక్త స్రావమైంది. ఆగ్రహించిన నిరుద్యోగ అభ్యర్థులు బ్లాక్ ముందు నిరసనకు దిగారు. తక్షణమే అకారణంగా చేయి చేసుకున్న పోలీస్ను వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవని కాంగ్రెస్ను గెలిపిస్తే ఉద్యోగాలు కావాలని అడిగితే పోలీసులతో కొట్టించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన కంటే మాజీ సీఎం కేసీఆర్ పాలన ఎంతో బెటర్ అని అన్నారు.