ఎర్రగడ్డ, జనవరి 11 : డూప్లికేట్ కీ సహాయంతో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను తస్కరిస్తున్నారు. చోరీ వాహనాలపై దర్జాగా తిరుగుతూ ఇంధనం అయిపోయిన వెంటనే ఆ వాహనాన్ని అక్కడే వదిలేసి మరో వాహనం దొంగలిస్తున్నారు. ఎట్టకేలకు బోరబండ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ భూపాల్గౌడ్ కథనం ప్రకారం.. పాతబస్తీ నివాసి సయ్యద్ నిజాం అహ్మద్ ఒంటరిగా ఉంటున్నాడు.
రోడ్లపై తిరుగుతూ పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను డూప్లికేట్ కీ సహాయంతో తస్కరిస్తున్నాడు. బోరబండ ఠాణా పరిధిలో ద్విచక్ర వాహనాలు మాయమైన ఘటనలపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గురువారం అరెస్టు చేసి, కోర్టులో హాజరు పర్చినట్లు డీఐ పేర్కొన్నారు. నిందితుడి వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.