రవీంద్రభారతి, జనవరి14 : గానగంధర్వుడు పద్మశ్రీ ఘంటసాల పాటలు తెలుగు భాష ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలిచిపోతాయని సుప్రీం కోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. ఘంటసాల వేంకటేశ్వరావు శతజయంతిని పురస్కరించుకొని కళైమామణి పార్వతీ రవి, ఘంటసాల డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం రవీంద్రభారతిలోని ప్రధాన మందిరంలో ఘంటసాల జీవనసాఫల్య పురస్కారాల పంపిణీని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుప్రీం కోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ విచ్చేసి ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి వాసురావు, భగద్గీత పారాయణ గాయకుడు ఎల్.వి గంగాధరశాస్త్రిలకు ఘంటసాల కళా ప్రదర్శిణి జీవన సాఫల్య పురస్కారాన్ని బహుకరించారు. అనంతరం ఎన్వీ రమణ మాట్లాడుతూ తెలుగు సినీ రంగంలో ఘంటసాల ఓ వెలుగు వెలిగిన గొప్ప గాయకుడని అన్నారు.
అంతేకాకుండా కందుకూరి వీరేశలింగం పంతులు, గురుజాడ అప్పారావులను ఆదర్శంగా తీసుకొని అనేక సామాజిక గీతాలను పాడారని పేర్కొన్నారు. తెలుగు భాష కోసం, తెలుగు సాహిత్యం కోసం అహర్నిశలు తపించిన గొప్ప గాయకుడు ఘంటసాల వేంకటేశ్వరావు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ విశ్రాంత అంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఎల్.వి. సుబ్రహ్మణ్యం, పురస్కార గ్రహీతలు సాలూరి వాసురావు, ఎల్.వి గంగాధరశాస్త్రిలు ఘంటసాల పాటలను పాడి వీక్షకులను అలరించారు. అనంతరం ఈ సభకు విచ్చేసిన పలువురు వక్తలు ఘంటసాలకు భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో భాష, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, పి. రాజ్గోపాల్, వంశీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీరామరాజు, కళా పత్రి సంపాదకుడు మహ్మద్ రఫీ, గాయకుడు రామాచారి, ప్రముఖ జర్నలిస్టు మాశర్మ, లక్ష్మీదేవి, ఎస్.వి సూర్యప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కళైమణి డ్యాన్స్ అకాడమీ కళాకారులు ఘంటసాల పాడిన పాటలను ఆలపిస్తూ తమ నాట్యప్రదర్శనతో అందరిని అబ్బురపరిచారు.