జోడు డప్పుల్.. మోగే జోరు సప్పుల్.. యెంట యాట పిల్లల్.. నాటు కోడి పుంజుల్.. నీ తానకు బయలెల్లినమే ఓ మైసమ్మ.. అంటూ పాతనగరం శిగమూగింది. ఆషాఢం ఆఖరి ఆదివారం కావడంతో భాగ్యనగరమంతా బోనమెత్తింది. పోతురాజుల విన్యాసాలు.. శివసత్తుల పూనకాలు.. డప్పు చప్పుళ్లు.. మహిళల కోలాటాలతో గల్లీలన్నీ దరువేశాయి. అమ్మవారి ఆలయాలన్నీ ఆడపడుచుల బోనాలతో కొత్త శోభను సంతరించుకున్నాయి. భక్తితో బయలెల్లి..అమ్మకు ప్రణమిల్లి.. మహిళలు అమ్మవార్లకు బోనం సమర్పించి.. మొక్కులు చెల్లించుకున్నారు. పాతనగరంలోని చారిత్రక లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయంలో మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు సమర్పించారు. అంతకుముందు మహంకాళి ఆలయం నుంచి నల్లపోచమ్మ ఆలయం వరకు అమ్మవారి ప్రతిమను అంబారీపై ఊరేగించారు. తెల్లవారు జాము నుంచే భారీ సంఖ్యలో భక్తులతో పాటు మంత్రులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆషాఢం.. ఆదివారం.. భాగ్యనగరం భక్తిమయమైంది. పోతురాజుల ఆటలు.. శివసత్తుల పూనకాలు.. డప్పు చప్పుళ్లతో గల్లీలన్నీ దరువేశాయ్. తెలంగాణ సంప్రదాయానికి అద్దంపట్టే జానపద గీతాలతో మార్మోగాయి. బోనాల జాతరతో నగరమంతా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. కాలనీలు, బస్తీలు, అమ్మవారి దేవాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆడపడుచులు అమ్మవార్లకు బోనం సమర్పించి..మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యంగా పాతబస్తీలోని చారిత్రక లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయంలో బోనాల వేడుకలు కనులపండువగా కొనసాగాయి. తెల్లవారు జాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భారీ సంఖ్యలో భక్తులతో పాటు మంత్రులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
-సిటీబ్యూరో, జూలై 16 (నమస్తే తెలంగాణ )/ చాంద్రాయణగుట్ట/చార్మినార్
పట్టువస్ర్తాల సమర్పణ
హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయం, లాల్దర్వాజ సింహవాహిని , మీరాలం మండి శ్రీ మహాకాళేశ్వర, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్రెడ్డి పట్టువస్ర్తాలను సమర్పించారు. అక్కన్న మాదన్న, సబ్జిమండి, మీరాలం మండి, చార్మినార్ భాగ్యలక్ష్మి, ఉప్పుగూడ మహంకాళి, భరతమాత, హరిబౌలి, బంగారు మైసమ్మ, నాంపల్లిలోని ఏడు గుళ్లు, గౌలిగూడ, కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కాగా, ఉప్పుగూడ శ్రీ మహాకాళి అమ్మవారి దేవాలయంలో నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టువస్ర్తాలను సమర్పించారు.
సంస్కృతిని ప్రపంచానికి చాటిన బోనాలు
తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటింది బోనాలేనని, లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయాన్ని దర్శించుకొని అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించడం ఎంతో సంతోషంగా ఉన్నదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. లాల్దర్వాజ అమ్మవారికి తొలి బోనం, పట్టువస్ర్తాలు సమర్పించిన ఆయన.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల ఉత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంలో పండుగలకు గుర్తింపునిచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు.
దర్శించుకొని.. పూజలు చేసి..
లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారిని మంత్రులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్సీ వాణీదేవి, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి బంగారు బోనాలను సమర్పించారు. జోగిని శ్యామల వెండి బోనం సమర్పించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్కుమార్, కట్టెల శ్రీనివాస్యాదవ్, సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క, కాంగ్రెస్ నేతలు వీహెచ్ హన్మంతరావు, మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ నేతలు మర్రి శశిధర్రెడ్డి తదితరులు సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు. లాల్ దర్వాజ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికలపై మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, ఇంద్రకరణ్రెడ్డి తొట్టెల ఊరేగింపు, ఘటాలకు స్వాగతం పలికారు.
ప్రత్యేక ఆకర్షణగా..
ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బోనాల జాతరకు రావడం ఇదే తొలిసారని చెప్పారు. బేబీ మూవీ ఫేం వైష్ణవి చైతన్య సైతం అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు.
అమ్మవారి ఆశీస్సులతో..
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. పండుగలు, ఉత్సవాలు ప్రజల మధ్య ఐక్యతను చాటేందుకు తోడ్పడతాయని చెప్పారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాతే తెలంగాణలోని అన్ని పండుగలకు గుర్తింపు వచ్చిందంటూ.. ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
అంబారీపై అమ్మవారు..
కార్వాన్ సబ్జిమండిలోని మహంకాళి, నల్లపోచమ్మ ఆలయాల్లో అమ్మవార్లకు ఆడపడుచులు బోనాలు సమర్పించారు. ఉత్సవాల్లో భాగంగా మహంకాళి ఆలయం నుంచి నల్లపోచమ్మ ఆలయం వరకు అమ్మవారి ప్రతిమను అంబారీపై అధిష్టింపజేసి.. ఊరేగించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.