Drinking Water | సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): వేసవి కావడంతో ఎండలు దంచికొడుతున్నాయి. అదే సమయంలో చాలా ప్రాంతాల్లో తాగునీరు లభించకపోవడంతో ప్రజలు ప్రైవేటు ట్యాంకర్లు, మినరల్ వాటర్పై ఆధారపడుతున్నారు. అయితే, నగరంలో జలమండలి పరిధిలో సరఫరా అయ్యే నీటి నాణ్యతలో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ, ప్రైవేటు ట్యాంకర్లు, మినరల్ క్యాన్ల ద్వారా సరఫరా చేసే నీటి నాణ్యతపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఆ నీటిని తాగే ప్రజల ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. మూడు నాలుగు రోజుల కిందట బెంగళూరులో కలుషిత నీరు తాగడం వల్ల స్థానికంగా కొంతమంది కలరా వ్యాధి బారిన పడినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రైవేటు ట్యాంకర్లు, మినరల్ వాటర్ క్యాన్లపై ఆధారపడి ఉన్న ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కొంత మంది ప్రైవేటు ట్యాంకర్ల నిర్వాహకులు నీటి నాణ్యతపై ఎలాంటి శ్రద్ధ వహించకుండా ప్రజల డిమాండ్ మేరకు బోర్ల నుంచి నీటిని నింపి సరఫరా చేస్తుంటారు. ఈ క్రమంలో నీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. అదే తరహాలో మినరల్ వాటర్ క్యాన్లు విక్రయించే వారు సైతం నీటి నాణ్యత విషయంలో ఎలాంటి ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటు ప్రైవేటు వాటర్ ట్యాంకర్ల విషయంలో, ఇటు మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వాహకుల విషయంలోనూ సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో బెంగళూరు పరిస్థితులు తలెత్తే ప్రమాదం లేకపోలేదని ప్రజలు వాపోతున్నారు.
సాధ్యమైనంత వరకు ప్రభుత్వం సరఫరా చేసే నీటిని మాత్రమే తాగడం మంచిదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ నీటి సరఫరా లేని వారు ప్రైవేటు ట్యాంకర్లు, మినరల్ వాటర్పై ఆధారపడటం సహజం. అయితే, ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన ట్యాంకర్లు, మినరల్ వాటర్ ప్లాంట్ల నుంచి మాత్రమే నీటిని కొనుగోలు చేయడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు బయటి నుంచి కొనుగోలు చేసే నీటిని కాచి, చల్లార్చి తాగడం ఆరోగ్యానికి మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
మండు వేసవిలో దాహార్తిని తీర్చుకోవడానికి చాలా మంది రోడ్లపై విక్రయించే చల్లటి పానియాలు, పండ్లరసాలు వంటి వాటిని ఎక్కువగా తాగుతుంటారు. అయితే, వీటిని తయారు చేసే క్రమంలో వినియోగించే నీరు కలుషితమైతే డయేరియా వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం లేకపోలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పరిశుభ్రత లేని చోట పానియాలు, జ్యూస్లు తాగవద్దని సూచిస్తున్నారు. అంతే కాకుండా.. రోడ్లపై విక్రయించే పానీపూరి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని, పానీపూరిలో వినియోగించే మసాలా నీటి వల్ల చాలా మంది డయేరియాకు గురైన సందర్భాలు ఉన్నట్లు ఉస్మానియా వైద్యులు హెచ్చరిస్తున్నారు. పరిశుభ్రత, స్వచ్ఛత లేనిచోట ఎలాంటి ఆహార పదార్థాలు, పానియాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు.
కలుషిత నీటి వల్ల డయేరియా వంటివి వస్తుంటాయి. అందుకని ప్రజలు తాగునీటి విషయంలో జాగ్రత్త వహించాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు స్వచ్ఛమైన నీటినే తాగాలి. తాగునీరు కలుషితం కాకుండా శుభ్రత పాటించాలి. బయట పానియాలు, జ్యూస్లు, కూల్డ్రింక్స్ వంటి వాటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. కొబ్బరి నీళ్లు, తాజా పండ్ల రసాలు, మజ్జిగ వంటివి తీసుకోవడం ఉత్తమం. వాంతులు, విరేచనాలు వంటివి జరిగితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. కలరా/డయేరియా వంటివి పెద్ద ప్రమాదకరమైన వ్యాధులేమి కాదు. సకాలంలో ట్రీట్మెంట్ అందించి పూర్తిగా నయం చేయవచ్చు. సకాలంలో సరైన వైద్యం తీసుకోకపోతే.. రోగి డీహైడ్రేషన్కు గురై, ప్రాణాంతకం కావచ్చు. అందుకని వాంతులు, విరేచనాలు జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. రోగికి మధ్యలో కొబ్బరి బొండా, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తరచూ ఇస్తూ ఉండాలి. దీని వల్ల రోగి డీహైడ్రేషన్కు గురికాకుండా కాపాడవచ్చు.