Hyderabad | సిటీబ్యూరో, మార్చి 23 (నమస్తే తెలంగాణ): తెలుగు మ్యాట్రిమోని ద్వారా పరిచయమై, పెండ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ వద్ద నుంచి రూ.70లక్షలు వసూలు చేసి మోసగించిన ఓ వ్యక్తిని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లాకు చెందిన ద్రొనదుల రాజేశ్(40) వృత్తిరీత్యా ఆన్లైన్ ట్రేడర్. అమాయకులను మోసగించి, డబ్బులు సంపాదించాలనే దురాశతో రాజేశ్ తెలుగు మ్యాట్రిమోనితోపాటు పలు మ్యారేజ్ బ్యూరో సైట్లు, యాప్లలో తన ప్రొఫైల్ను రిజిస్టర్ చేయించుకున్నాడు.
ఈ క్రమంలో నగరానికి చెందిన ఓ మహిళను పరిచయం చేసుకున్న నిందితుడు క్రమంగా ఆమెతో మాటలు కలిపి వాట్సాప్ ద్వారా చాట్ చేయడం, మాట్లాడటం మొదలుపెట్టాడు. తప్పుడు వివరాలతో ఆ మహిళకు దగ్గరయ్యాడు. అంతే కాకుండా తాను కొంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, తనకు ఆర్థిక సాయం చేస్తే వివాహం చేసుకున్న తరువాత తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తానన్నాడు. ఇది నమ్మిన ఆ మహిళ ఏప్రిల్ 30, 2023న మొదటిసారిగా రూ.2లక్షలను రాజేశ్కు పంపించింది.
అనంతరం తాను వ్యక్తిగతంగా కలుస్తానంటూ ప్రకాశ్నగర్లోని స్టార్ బకెట్ రెస్టారెంట్లో ఆ మహిళను కలిసి మరింత నమ్మకం కుదిరించాడు. ఈ క్రమంలో సదరు మహిళను తరచూ ఆర్థిక సమస్యల పేరుతో డబ్బులు అడగడం మొదలు పెట్టాడు. నిందితుడిని నమ్మిన బాధితురాలు తన సొంత డబ్బుతోపాటు బయట అప్పులు చేసి, బంగారం కుదువబెట్టి మరీ సుమారు రూ.70లక్షల వరకు ముట్టజెప్పింది. డబ్బులు తీసుకున్న నిందితుడు తన విశ్వరూపం చూపించడం మొదలుపెట్టాడు.
పెండ్లి విషయం అడిగితే బూతులు తిట్టడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడి వివాహం చేసుకోనని తేల్చి చెప్పాడు. దీంతో తన వద్ద నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితురాలు రాజేశ్ను కోరింది. పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడమే కాకుండా తీసుకున్న డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితురాలు సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం రాజేశ్ను అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.