మన్సూరాబాద్ : ఫంక్షన్ హాళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్తుడిని సరూర్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ. 8.50 లక్షల విలువైన 17 తులాల బంగారు ఆభరణాలు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
ఎల్బీనగర్లోని రాచకొండ కమీషనరేట్ సీపీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ వివరాలను వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లా, గొల్లగేరి ఎనుగొండకు చెందిన జాజల లక్ష్మీనర్సింహా స్వామి అలియాస్ రవితేజ అలియాస్ లడ్డు (27) కోటకద్ర గ్రామంలో జేసీబీపై క్లీనర్గా పని చేస్తున్నాడు.
వచ్చే డబ్బులు సరిపోక దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. మహబూబ్నగర్ అన్నానగర్ పీఎస్, మహబూబ్నగర్ రూరల్, జడ్చర్ల, శంషాబాద్ ఆర్జీఐఏ పీఎస్, యాదగిరిగుట్ట, సరూర్నగర్ పీఎస్ పరిధిలలో తొమ్మిది కేసుల్లో పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చాడు. జైలుకు వెళ్లినప్పటికీ అతడిలో మార్పు రాలేదు.
అందంగా తయారై ఫంక్షన్హాళ్లకు వెళ్లి పెండ్లి కూతురుకు అలంకరించేందుకు బంగారు అభరణాలు భద్రపర్చిన గదిని కనిపెట్టేవాడు. అందరూ బిజీగా ఉన్న సమయంలో గదిలోకి దూరి బంగారు నగలలో కొన్నింటిని మాత్రమే అపహరించి అక్కడి నుంచి పరారయ్యేవాడు.
అలా సరూర్నగర్ పీఎస్ పరిధిలో-2, హయత్నగర్ పీఎస్-1, మీర్పేట్ పీఎస్-1 దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలతో తేలింది. నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి, సరూర్నగర్ డీఎస్ఐ సునీల్రెడ్డి పాల్గొన్నారు.