బంజారాహిల్స్ : పదేళ్ల బాలుడిపై లైంగికదాడికి పాల్పడిన కేసులో పరారీలో ఉన్న నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకృష్ణానగర్లో నివాసం ఉండే టి.సాయికిరణ్ (19) అనే యువకుడు రెండున్నర ఏండ్ల క్రితం అదే ఇంట్లో నివాసం ఉండే పదేళ్ల బాలుడిని గదిలోకి తీసుకువెళ్లి ఫోన్లో అశ్లీల వీడియోలు చూపించాడు.
అంతటితో ఆగకుండా అతడిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. కొన్నాళ్లకే తల్లి ఉద్యోగరీత్యా బెంగళూరుకు బదిలీ అవడంతో అక్కడికి వెళ్లిన తర్వాత విషయాన్ని తన తల్లికి చెప్పాడు. సుమారు ఏడాదిన్నర క్రితం బాలుడి తల్లి బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసారు. సంఘటన జరిగిన ప్రాంతం జూబ్లీహిల్స్ పరిధిలోకి వస్తుండడంతో ఇటీవల కేసును ఇక్కడకు బదిలీ చేశారు.
అప్పటినుంచి పరారీలో ఉన్న నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.