మేడ్చల్ కలెక్టరేట్, మే 16 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి జూన్ 2వ తేదీ నాటికి 9 ఏండ్లు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతామన్నారు. పదేండ్లలో జిల్లాలో సాధించిన విజయాలు, అభివృద్ధిపై నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అవతరణ ఉత్సవాల ఏర్పాట్లపై ముందస్తు ప్రణాళికలు రూపొందించుకొని, జిల్లాలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఏవో వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.