హైదరాబాద్ : ఈ నెల 17 న జరిగే సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం వెస్ట్ మారేడ్పల్లి లోని తన నివాసం వద్ద మహంకాళి అమ్మవారి జాతర (బోనాల ఉత్సవాల) పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. బోనాల ఉత్సవాలకు సంబంధించి పోస్టర్లు, బ్యానర్ల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మహంకాళి ఉత్సవాలకు లక్షలాది మంది వచ్చే అవకాశం ఉన్నందున భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మహిళలు, బోనాలు తీసుకొచ్చే వారికి ప్రత్యేక క్యూ లైన్ లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
ఈ సంవత్సరం బోనాల ఉత్సవాలకు ముందే ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, ఆర్టీసీ సికింద్రాబాద్ డీవీఎం అపర్ణ కల్యాణి తదితరులు పాల్గొన్నారు.