సచివాలయ పరిసరాలన్నీ ఆంక్షల వలయంలో ఉండబోతున్నాయి. ఈ నెల 11 నుంచి ప్రతిష్టాత్మకంగా జరుగనున్న ఫార్ములా ఈ – రేసింగ్, 17న డా.బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం ప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతున్నారు. ఈ మేరకు భద్రతా ఏర్పాట్లపై మంగళవారం బీఆర్కేఆర్ భవన్లో ఉన్నతాధికారులతో సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. సీఎస్ ఆదేశాల మేరకు 3 కంపెనీల తెలంగాణ స్పెషల్ పోలీస్, 300 సిటీ పోలీస్ అధికారులు బందోబస్తులో ఉండనున్నారు.
300 సీసీ టీవీల ద్వారా భద్రతను పర్యవేక్షించటమే కాకుండా ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. సచివాలయం చుట్టూ ఆరు సెంట్రీ పోస్టులు, 34మంది సిబ్బందితో రెండు ఫైర్ ఇంజన్లను ఏర్పాటు చేస్తున్నారు. మరో వైపు ఫార్ములా ఈ – రేసింగ్ పనులను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ పరిశీలించారు. ఈ-రేసింగ్ నేపథ్యంలో ఈ నెల 5 నుంచే ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వస్తాయి. తెలుగు తల్లి ఫైఓవర్ నుంచి ఖైరతాబాద్ ఫైఓవర్ వరకు, మింట్ కాంపౌండ్ నుంచి ఐమాక్స్ వరకు రోడ్లను మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.
5వ తేదీ నుంచే ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి..!
ఫిబ్రవరి 11వ తేదీన హైదరాబాద్లో ప్రారంభం కానున్న ఫార్ములా ఈ-రేసింగ్కు సంబంధించి 5వ తేదీ నుంచే ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయని సీఎస్ తెలిపారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వరకు, మింట్ కాంపౌండ్ నుంచి ఐమాక్స్ వరకు భద్రతా కారణాల దృష్ట్యా రోడ్లను మూసివేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. సిటీ ట్రాఫిక్ విభాగం నుంచి ప్రత్యేక ట్రాఫిక్ అధికారులను కేటాయించాలన్నారు.
సచివాలయ ప్రారంభానికి..
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డా.బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయాన్ని ఫిబ్రవరి 17న ప్రారంభించనున్న సందర్భంగా ఇప్పటినుంచే కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు సీఎస్ తెలిపారు. ఫార్ములా ఈ-రేసింగ్ ట్రాక్, నూతన సచివాలయం రెండూ పక్కపక్కనే ఉండటంతో పనులకు ఎలాంటి అంతరాయం కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సచివాలయ ప్రారంభానికి సంబంధించి భద్రతాపరమైన ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలన్నారు. పోలీస్శాఖ, రోడ్లు భవనాలు, జీఏడీ, తెలంగాణ స్పెషల్ పోలీస్, ఐటీ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇప్పటికే జలమండలి ద్వారా నీటి సరఫరా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని, సీవరేజీ పనులు మెరుగ్గా పూర్తి చేస్తున్నామని జలమండలి అధికారులు ఆమెకు తెలిపారు. ఈ కార్యక్రమాలకు వచ్చే దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
భద్రతలో రాజీ పడొద్దు..
సచివాలయం ప్రారంభానికి భద్రతను కట్టదిట్టం చేయాలని పోలీస్శాఖను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. 3 కంపెనీల తెలంగాణ స్పెషల్ పోలీస్, 300 సిటీ పోలీస్ అధికారులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. భద్రతా పరికరాలైన బ్యాగేజ్ సానర్లు, వెహికిల్ సానర్లు, బాడీ సానర్లు, ఇతర పరికరాలను వెంటనే సమకూర్చుకోవాలని ఆదేశించారు. మొత్తం 28 ఎకరాల్లో నిర్మించిన ఈ నూతన సచివాలయంలో 560 కార్లు, 900లకు పైగా ద్విచక్ర వాహనాల పారింగ్కు ఏర్పాట్లు చేశారు. 300 సీసీ టీవీల ద్వారా భద్రతను పర్యవేక్షించనున్నారు. సీసీ టీవీలతో పాటు ఇతర భద్రతా పరమైన చర్యల పర్యవేక్షణకు ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు చేయనున్నట్లు డీజీపీ తెలిపారు. సచివాలయం చుట్టూ ఆరు ఎంట్రీ పోస్టుల ఏర్పాటుతోపాటు 34మంది సిబ్బందితో రెండు ఫైర్ ఇంజన్లను ఏర్పాటు చేస్తామన్నారు.
6వ అంతస్తు మినహా..సందర్శకులకు అనుమతి
సచివాలయ భవనంలో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని, 6వ అంతస్తు మినహా అన్ని అంతస్తులకు సందర్శకులకు పరిమితమైన అనుమతి ఇవ్వాలని సీఎస్ ఆదేశించారు. ఆధునాతన కార్పొరేట్ కార్యాలయాల మాదిరిగా సచివాలయంలోకి వచ్చి వెళ్లే సందర్శకులకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులతో కూడిన మానిటరింగ్ పక్కాగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో డీజీపీ అంజనీ కుమార్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఎస్పీఎఫ్ డీజీ ఉమేశ్ ష్రాఫ్, అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్, ఫైర్ సర్వీసుల డీజీ నాగిరెడ్డి, ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీ అనిల్కుమార్, ఈఎన్సీ గణపతిరెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.