అబిడ్స్, మే 31: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు నిమగ్నమైనారు. అమరవీరుల స్థూపం గన్పార్క్, పబ్లిక్ గార్డెన్స్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ దీపాలను అమర్చి జూన్ 2న ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాలను ఎగుర వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమరవీరుల స్థూపం గన్పార్క్ వద్ద నివాళులు అర్పించే కార్యక్రమాలు చేపట్టనుండడంతో పుష్పాలంకరణ పనులను చేపట్టనున్నారు. డివైడర్లకు రంగులు వేయడంతో పాటు ప్రధాన కూడళ్లలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన యూనియన్ నాయకులు, ప్రభుత్వ శాఖల అధికారులు, టీఆర్ఎస్ నాయకులు సంబురాలను జరిపేందుకు గాను ఏర్పాట్లు చేపట్టనున్నారు.
రేపు ప్రభుత్వ కార్యాలయాల్లో .. జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాలు
రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాలను ఎగుర వేసేందుకు గాను అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. కలెక్టరేట్, జీహెచ్ఎంసీ కార్యాలయం, ఎక్సైజ్ కమిషనరేట్, గగన్విహార్, చంద్రవిహార్, గృహకల్ప, మనోరంజన్ కాంప్లెక్స్, టీఎస్పీఎస్సీ కార్యాలయాలలో జాతీయ పతాకాలను ఎగుర వేయనున్నారు.
పలుచోట్ల సేవా కార్యక్రమాలు..
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ నాయకులు పార్టీ తోరణాలను బస్తీల్లో ఏర్పాటు చేయడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు చర్యలు తీసుకోనున్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు దవాఖానల్లో రోగులకు పండ్లు పంపిణీ, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలను చేపట్టనున్నారు.