ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 13: సాయుధ రైతాంగ పోరాటం, తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాలు సమకాలీన భారతదేశ చరిత్రలో అద్భుత ఘట్టాలని అలహాబాద్ యూనివర్సిటీ, కళ్యాణి యూనివర్సిటీల మాజీ వైస్ చాన్స్లర్, ప్రముఖ చరిత్రకారుడు ప్రొఫెసర్ రతన్లాల్ హంగ్లూ అన్నారు. చరిత్రకారులు సత్యాన్ని సత్యంగా రాయాలని, ఎట్టిపరిస్థితుల్లో అబద్ధాలు రాయకూడదని సూచించారు. ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాల్లో జరిగిన సంఘటనలు నేటి తరానికి మార్గదర్శకంగా మారాయని, కానీ మారుతున్న సామాజిక అవసరాలకు అనుగుణంగా చరిత్రకారులు సూక్ష్మంగా, నిష్పక్షపాతంగా తన రచనల్లో తెలియజేయాలని చెప్పారు. దేశ సమగ్రత, సంస్కృతి, వారసత్వ కట్టడాలను భంగం కల్గించే రచనలు చేయరాదన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ హిస్టరీ విభాగంలో ‘రీసెంట్ ట్రెండ్స్ ఇన్ హిస్టారికల్ రీసర్చ్’అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించారు.
ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన ఈ సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ హంగ్లూ హాజరై కీలకోపన్యాసం చేశారు. స్వాతంత్య్రానంతరం జరిగిన చారిత్రక పరిశోధనలు భారతీయ చరిత్ర, సంస్కృతిని ప్రపంచానికి నిర్మాణాత్మక రీతిలో తెలియ జెప్పాయని గుర్తు చేశారు. ప్రొఫెసర్ ఆర్సీ మజుందార్ నేతృత్వంలో వెలువడిన భారతీయ విద్యాభవన్ సిరీస్ సంపుటాలు దేశ చరిత్రకు సంబంధించిన ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక చరిత్రలోని వివిధ ఘట్టాలను నిష్పక్షపాతంగా వివరించడంలో సఫలీకృతమయ్యాయని ప్రశంసించారు. నేటికీ ఆ సంపుటాలు యువ చరిత్రకారులు, పరిశోధకులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రపంచీకరణ నేపథ్యంలో సైన్స్ అండ్ టెక్నాలజీ వికాస యుగంలో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చరిత్ర పరిశోధనకు పెద్ద పీట వేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో విభాగం హెడ్, సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ అంజయ్య, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, మాజీ వీసీ ప్రొఫెసర్ సులేమాన్ సిద్ధిఖీ, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గణేశ్, ప్రొఫెసర్ లావణ్య, డాక్టర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.