మియాపూర్, మార్చి 27 : శేరిలింగంపల్లి మండలంలో పది పరీక్షలకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ వైపు ఇంటర్ పరీక్షల నిర్వహణలో నిమగ్నమవుతూనే మరో వైపు వీటి ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు. పరీక్షలు మరో అరు రోజులలో ప్రారంభం కానున్న తరుణంలో ఇప్పటికే ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలో హాల్ టికెట్ల పంపిణీ ప్రక్రియను సైతం చేపడుతున్నారు. శేరిలింగంపల్లి మండలంలో పది పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే కేంద్రాలను సిద్ధం చేయగా.. వాటిల్లో వసతులను అధికారులు పలుమార్లు పరిశీలించారు. వేసవి ఎండలు మండుతున్న తరుణంలో విద్యార్థులు వడదెబ్బకు గురికాకుండా తాగునీటి వసతిని పూర్తి స్థాయిలో చేపట్టాలని ఉన్నతాధికారులు మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మరో పక్క పరీక్షలలో ప్రశ్న పత్రం లీకేజీకు గురికాకుండా ప్రతీ పరీక్ష కేంద్రంలో విధిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ నుంచి కేంద్రానికి తీసుకువచ్చిన ప్రశ్న పత్రం తెరిచే గదిలో విధిగా సీసీ కెమెరా ఉండాలన్నది జిల్లా విద్యాశాఖ అధికారుల విస్పష్టమైన ఆదేశం. అయితే ఈ విద్యాసంవత్సరానికి గాను మండలంలో నాలుగున్నర వేలకు వరకు విద్యార్థులు పది పరీక్షలకు హాజరుకానున్నారు.
శేరిలింగంపల్లి మండలంలో పది పరీక్షలకు గాను మొత్తం 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 6 ప్రభుత్వ పాఠశాలల్లోని కేంద్రాలు కాగా.. మిగిలినవన్నీ ప్రయివేటు పాఠశాలల్లోని కేంద్రాలే. మండలంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు చెందిన 4500 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. కాగా పరీక్ష కేంద్రాలకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్(సీఎల్), డిపార్ట్మెంటల్ ఆఫీసర్(డీవో)ల నియామక ప్రక్రియ పూర్తికావటంతో పాటు నియాకమైన ఉపాధ్యాయులందరికీ ఆదేశాలు సైతం జారీ అయ్యాయి. ఏప్రిల్ 3 నుంచి 11 వరకు పది పరీక్షలు జరగున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహణ సమయం కాగా.. తీవ్రమైన ఎండలు.. ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా గంట ముందు నుంచే పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తారు. మరో పక్క పరీక్ష కేంద్రం అధికారులతో పాటు ఇన్విజిలేటర్ల నియామక ప్రక్రియ సైతం పూర్తయి వారికీ లిఖిత పూర్వక ఆదేశాలు అందాయి. పరీక్ష కేంద్రంలో అవకతవకలకు ఆస్కారం లేకుండా విధిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. వీటిని మండల విద్యాశాఖ అధికారి ముందస్తుగా తనిఖీ చేసి నిర్థరించాలని జిల్లా అధికారులు పేర్కొన్నారు. బందో బస్తు పరంగా పోలీసు అధికారులు సైతం తగు ఏర్పాట్లు చేస్తున్నారు.
పది పరీక్షల నిర్వహణకు శేరిలింగంపల్లి మండలంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈవో వెంకటయ్య పేర్కొన్నారు. పరీక్ష కేంద్రంలో ప్రశ్న పత్రం తెరిచే గదిలో తప్పకుండా సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని ఆదేశించాం. పరీక్షకు గంట ముందు నుంచే విద్యార్థులను కేంద్రంలోకి అనుమతిస్తామని తెలిపారు.