హైదరాబాద్ : బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేలా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఘటాల ఊరేగింపు ను ప్రారంభించారు. అనంతరం ఆలయం ముందు, వెనుక చేపట్టిన వీడీసీసీ రోడ్డును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 17 న జరిగే మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు వస్తారన్నారు. అందుకు అనుగుణంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అమ్మవారికి బోనాలను తీసుకొచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు.
అమ్మవారి బోనాల నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ, ఏసీపీ రమేష్, ఇన్ స్పెక్టర్ శ్రీనివాసులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.