మియాపూర్ , మే 5 : రాష్ట్ర సమగ్రాభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధిలో ముం దుకు సాగుతున్నట్లు విపత్కర పరిస్థితులను ఎదురవుతున్నా సంక్షేమాన్ని చిత్తశుద్ధితో కొనసాగిస్తున్నామన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివిధ డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా మంజూరైన చెక్కులను కార్పొరేటర్లు మంజులరెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావులతో కలిసి విప్ అరెకపూడి గాంధీ మియాపూర్లోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం అందించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నప్పటికీ ఓ వైపు వారి రక్షణకు సంబంధించిన చర్యలను చేపడుతూ మరోవైపు ప్రజలకు బాసటగా సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ అండగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, రాబోయే రోజులలో మరిన్ని సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ చేరనున్నాయన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విప్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, చందానగర్ డివిజన్ పార్టీ అధ్యక్షుడు రెడ్డి రఘునాథ్రెడ్డి సహా పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.