సిటీబ్యూరో, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ) : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, పల్లె ప్రజల నిజ జీవితాలకు అద్దంపట్టే చిత్రం ‘బలగం’ అని, ఈ చిత్రం తెలంగాణలో గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందని అలనాటి ప్రముఖ దర్శకుడు బి.నరసింగరావుతోపాటు పలువురు మేధావులు, విశ్లేషకులు ప్రశంసించారు. అశ్లీలత, హింస వంటి అంశాలు లేకుండా ఒక మంచి చిత్రాన్ని ఎలా తీయవచ్చో ఈ సినిమా నిరూపించిందని కొనియాడారు. జాతీయ ప్రజా సంబంధాల దినోత్సవాల్లో భాగంగా పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ప్రముఖ విద్యావేత్త, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అధ్యక్షతన బుధవారం వెబినార్ నిర్వహించారు.
ఈ వెబినార్లో దేశ విదేశాలకు చెందిన పలువురు సినీ విశ్లేషకులు, విమర్శకులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ప్రముఖ రచయిత డాక్టర్ కె.శ్రీనివాస్, వెబ్నార్లో స్విట్జర్లాండ్ నుంచి పాల్గొన్న అంతర్జాతీయ నిపుణుడు డాక్టర్ భిక్షం గుజ్జ, మహిళా ఉద్యమకారిణి కవిత పులి, ఆర్గనైజేషన్ కమ్యూనికేషన్ నిపుణుడు ఎం.జయరాజ్, పీఆర్ఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ డాక్టర్ రాము సూరవజ్జుల, పీఆర్ఎస్ఐ జాతీయ సెక్రటరీ జనరల్ వై.బాబ్జీ, హైదరాబాద్ చాప్టర్ సెక్రటరీ కె.యాదగగిరి, ప్రముఖ రచయిత్రి కె.విమల, తెలంగాణ సారస్వత పరిషత్ కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య, పలువురు సినీ ప్రముఖులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.