వాహన ఆధారిత యాప్ డ్రైవర్లు తమ టార్గెట్ పూర్తి చేసుకోవడానికి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఒక్క రోజులో చాలా రైడ్స్ చేయాలనే ఆతృతతో నగర రోడ్లపై బండ్లను పరుగులు పెట్టిస్తున్నారు. నిమిషాల్లో రైడ్ పూర్తి చేసి మరో రైడ్ తీసుకోవాలని మితిమీరిన వేగంతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఇటీవల యాప్ డ్రైవర్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. అమీర్పేటలో రైడ్లో ఉన్న ఓ యువతి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
సిటీబ్యూరో, (నమస్తే తెలంగాణ) : యాప్ డ్రైవర్ల నిర్లక్ష్య డ్రైవింగ్తో రైడర్స్ జంకుతున్నారు. యాప్ డ్రైవర్లపై పర్యవేక్షించే వ్యవస్థ లేకపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. నెమ్మదిగా వెళ్లాలని ప్రయాణికుడు సూచిస్తే తనకు చెప్పాల్సిన అవసరం లేదని వాగ్వాదానికి దిగుతున్నారు. కొందరు డ్రైవర్లు బెదిరింపులకు సైతం పాల్పడుతున్నారు. చాలా మంది యాప్ డ్రైవర్లు మొబైల్ బైక్, ఆటోలకు అమర్చి వీడియోలు చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నారు. అలా డ్రైవింగ్ చేయొద్దని వారిస్తే కొంతమంది డ్రైవర్లు ప్రయాణికుడిపై దాడికి సైతం దిగుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. నగరవాసులు అత్యధికంగా తమ ప్రయాణ గమ్యాలు చేరుకోవడానికి యాప్ ఆధారిత వాహన సేవలపై ఆధారపడతున్నారు.
వివిధ యాప్ల్లో వాహనదారులు తమ వివరాలను అందించి డ్రైవర్లుగా మారుతున్నారు. అయితే చాలా మంది తమ వివరాలతో కాకుండా ఇతరుల లైసెన్స్ వివరాలతో యాప్లో లాగిన్ అయి అనుమతి పొందుతున్నారు. దీంతో వాహనం బుక్ చేసుకుంటే మరో నంబర్ గల వాహనం వస్తుంది. చాలా మంది ప్రయాణికులు ఇవేమీ పట్టించుకోకుండా ప్రయాణం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వాహన నంబర్లు ఒకేలా ఉన్నప్పటికీ డ్రైవర్లు మారుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
వారి భద్రత ప్రశ్నార్ధకంగా మారుతున్నది. కొందరు డ్రైవర్లు తమ బైక్ వాహనాల సీటును ఎత్తుగా ఉండేలా అమర్చుతున్నారు. దీంతో సదరు మహిళలు ఆ వాహనాలను ఎక్కినప్పుడు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలా నిర్లక్ష్యంగా డ్రైవర్లు వ్యవహరిస్తున్నా ఆయా సంస్థలు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా 40 శాతం యాప్ ఆధారిత డ్రైవర్లకు లైసెన్స్ లేదని వాహన సంఘాలు ఆర్టీఏ అధికారులకు ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. అధికారులు స్పందించి యాప్ సేవలను పారదర్శకంగా అందించేలా చర్యలు తీసుకోవాలని నగర ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
అతివేగం..రాంగ్ రూట్..
రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది మృత్యువాత చెందుతున్నారు. కొందరు గా యాలతో బయటపడుతున్నారు. ర్యాష్ డ్రైవింగ్తోనే అత్యధికంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇటీవల కూకట్పల్లి మార్గం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ఓ మహిళ మృతి చెందింది. ఎన్హెచ్ 44పై అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కాగా, గతేడాదిలో నగరంలో పదివేలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగితే అందులో సుమారు 18 వందల మంది మృత్యువాతపడ్డారు. 2024తో పోలిస్తే 2025లో ప్రమాదాల సంఖ్య 10 శాతం పెరిగిందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
అలాగే మృతుల సంఖ్య కూడా 6.5 శాతం పెరగడం గమనార్హం. ఈ ఏడాదిలోనూ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు వాహనదారులు అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ రూట్స్ ప్రయాణం చేయకూడదని అధికారులు వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతీ వాహనదారుడు రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆర్టీఏ, పోలీసులు విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.