న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: దేశంలోని నగరవాసుల్లో దాదాపు 70 శాతం మంది 60 ఏండ్ల కంటే ముందే రిటైర్ కావాలని కోరుకుంటున్నట్టు ఓ తాజా సర్వేలో తేలింది. రిటైర్మెంట్ అనంతర జీవిత అవసరాలు తీరేలా ఆర్థిక పరిపుష్ఠి ఉన్నైట్టెతే సంప్రదాయ ఉద్యోగ విరమణ వయసు 58-60 ఏండ్లకు ముందే కొలువులకు గుడ్బై చెప్పాలని చూస్తున్నట్టు బుధవారం యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ విడుదల చేసిన భారతీయ రిటైర్మెంట్ ఇండెక్స్ అధ్యయనం తెలియజేసింది.
మెట్రో నగరాలతోపాటు ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లో నివసిస్తున్నవారి అభిప్రాయాలతో ఈ నివేదిక తయారైంది. ఇందులో 4,134 మంది గృహస్తులూ పాల్గొన్నారు. కాగా, రిటైర్మెంట్ కాలంలో ప్రస్తుత జీవనశైలినే కొనసాగించాలంటే ఎంత నిధి అవసరమన్నది 61 శాతం మందికి తెలుసన్న సర్వే.. 11 శాతం మాత్రమే తమ శేష జీవితానికి సరిపడా నిధి ఉందని చెప్పారన్నది.
ఇక 39 శాతం మంది తమ రిటైర్మెంట్ నిధి ఐదేండ్లకూ చాలదన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇదిలావుంటే ప్రతి ఇద్దరిలో ఒకరు రిటైర్మెంట్ ప్రణాళికను కెరియర్ ఆరంభంలోనే చేసుకోవాలని చెప్తున్నారు. జెన్ జీలు ఈ వయసును 29 ఏండ్లుగానే పేర్కొంటుండగా, మిల్లేనియల్స్ 31 ఏండ్లుగా, జెన్ ఎక్స్ప్లస్ వయస్కులు 34 ఏండ్లుగా సిఫార్సు చేస్తున్నారు. ఇక 62 శాతం జెన్ జీలు ఇప్పటికే రిటైర్మెంట్ కోసం పెట్టుబడిని ప్రారంభించినట్టు చెప్పడం విశేషం. అయితే ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 52 శాతం మందే తమకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని చెప్పడం గమనార్హం.