అమీర్పేట్, జనవరి 22 : వీధికుక్కల కాటుకు గురవుతున్న వారిలో యాంటీబాడీస్ పెంచే ఇంజక్షన్లు అందుబాటులో ఉండేలా చూడాలని కరీంనగర్ నగర పాలక సంస్థకు చెందిన కార్పొరేటర్ కమల్జిత్ కౌర్, సోహన్సింగ్ దంపతులు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారితో కలిసి మంత్రి తలసానిని మారేడ్పల్లిలోని ఆయన నివాసంలో కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. వీధికుక్కల నియంత్రణ సాధ్యం కానటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బస్తీ దవాఖానలు, డిస్పెన్పరీల్లో రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటున్నా అది కుక్క కాటు వల్ల విషం మెదడుకు చేరకుండా చేయగలుగుతుందే తప్ప ఏకకాలంలో చికిత్స పొందుతున్న వ్యక్తి శరీరంలో యాంటీబాడీస్ ఉత్పత్తి చేయలేదని మంత్రికి వివరించారు. వీధికుక్కల సంఖ్య పెరుగుతుండటంతో స్కూళ్లకు నడుచుకుంటూ వెళ్లే విద్యార్థులు, పాదచారులు, చాలా సందర్భాల్లో వాహనాలపై వెళుతున్న వారు కూడా వీటిబారిన పడుతున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, అయితే రేబిస్ వ్యాక్సిన్తోపాటు యాంటీబాడీస్ ఉత్పత్తి చేసే ఇంజక్షన్లు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని వారు మంత్రిని కోరారు. ఇదే విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు దృష్టికి కూడా తీసుకువస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమీర్పేట్ బీఆర్ఎస్ నాయకులు సుమీత్సింగ్ తదితరులు పాల్గొన్నారు.