ప్రతి ఆదివారం 10గంటలకు పది నిమిషాల కార్యక్రమాన్ని ప్రారంభించిన మేయర్
బంజారాహిల్స్లోని నివాసంలో చెత్తాచెదారం, నీటి నిల్వల తొలగింపు
బంజారాహిల్స్, ఆగస్టు 22: జీహెచ్ఎంసీ చేపట్టిన ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాల పాటు దోమల నివారణ కార్యక్రమాల్లో ప్రతిఒక్కరూ పాలుపంచుకోవాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాల కార్యక్రమాన్ని ప్రారంభించిన మేయర్ బంజారాహిల్స్లోని తన నివాస ఆవరణతో పాటు బయట ఉన్న చెత్తాచెదారాన్ని స్వయంగా తొలగించారు. నిల్వ ఉన్న నీటిని పారబోశారు. అనంతరం జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం అధికారులతో కలిసి దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నామని అన్నారు. అన్ని ప్రాంతాల్లో యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని.. నగరవాసులంతా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. ఇండ్లల్లో, ఇంటి పరిసరాల్లో మురుగు నీరు నిల్వకుండా చూసుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రతతోనే దోమలను అరికట్టవచ్చని సూచించారు. కార్యక్రమంలో చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు, సీనియర్ ఎంటమాలజిస్ట్ దుర్గా ప్రసాద్, అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ రజిత, ఈఎఫ్ఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.