బంజారాహిల్స్,మార్చి 14: జూబ్లీహిల్స్లో నేపాలీ గ్యాంగ్ మరో భారీ చోరీకి పాల్పడింది. పక్కా ప్రణాళికతో ఓ సంపన్నుల బంగ్లాలో పనిమనుషులగా చేరిన భార్యాభర్తలు యజమానులు ఊరెళ్లిన సమయంలో అల్మారాలు పగలగొట్టి కోట్లాది రూపాయల విలువైన సొత్తుతో ఉడాయించారు. జూబ్లీహిల్స్ ఓబుల్రెడ్డి స్కూల్ సమీపంలోని ప్లాట్ నెంబర్ 305లో పింగళి అనిరుద్రెడ్డి, దీపికారెడ్డి దంపతులు నివాసం ఉంటారు. ఆ ఇంట్లో నేపాల్కు చెందిన మహేష్ షాహీ(30), అప్సర దంపతులు 45రోజుల క్రితం పనిమనుషులుగా చేరారు.
ఇంటి ఆవరణలోని సర్వెంట్ క్వార్టర్స్లో వారు నివాసం ఉంటున్నారు. కాగా కుటుంబసభ్యులతో కలిసి అనిరుధ్రెడ్డి. దీపికారెడ్డి శుక్రవారం మద్యాహ్నం ఊటీ వెళ్లారు. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత కట్టర్స్, రాడ్స్తో మహేష్ షాహీతో పాటు అతడి భార్య అప్సర యజమాని ఇంట్లోకి ప్రవేశించారు. బెడ్రూమ్లోని అల్మారాలను పగలగొట్టి డైమండ్ నెక్లెస్లు, రాడో వాచ్లు, బంగారు ఆభరణాలను తస్కరించి అక్కడినుంచి ఉడాయించారు.
శనివారం ఉదయం ఇంటికి వచ్చిన పనిమనిషితో పాటు డ్రైవర్ అలీ ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్న విషయాన్ని గుర్తించి జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్వాడ్ సాయంతో విచారణ చేపట్టారు. చోరీ అయిన సొత్తు సుమారు 2కోట్లదాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు జూబ్లీహిల్స్ పోలీసులతో పాటు టాస్క్ఫోర్స్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.