నగరవాసులకు మరో కేసీఆర్ అభివృద్ధి ఫలం దక్కింది. సోమవారం బాచుపల్లి ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ ఫ్లైఓవర్ 2024 నాటికే.. పూర్తి కావాల్సి ఉన్నా.. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా తీవ్ర జాప్యాన్ని ఎదుర్కొంది. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో మియాపూర్, నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్, బౌరంపేట్, మల్లంపేట్, గండిమైసమ్మ, గాజులరామారం వెంబడి ఉండే కాలనీలు, నివాస ప్రాంతాలు, విద్యా సంస్థలకు రాకపోకలు సులభతరం కానున్నాయి. ప్రయాణ సమయం 20 నిమిషాల నుంచి 5-10 నిమిషాలకు తగ్గనున్నది. 1.3 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టును హెచ్ఎండీఏ రూ. 65.53 కోట్లను ఖర్చు చేసింది.
సిటీబ్యూరో, జూన్ 8(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలన బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలకే సరిపోయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే గోపన్పల్లి ఫ్లైఓవర్ను ప్రారంభించిన నాటి నుంచి సోమవారం బాచుపల్లి-మియాపూర్ ఫ్లైఓవర్ వరకు బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రణాళికల్లో భాగంగా నిర్మించినవే. అయితే ఎప్పుడో పూర్తి కావాల్సిన ఆరు లేన్ల బాచుపల్లి ఫ్లైఓవర్ను ప్రారంభించారు. ఇది సైబరాబాద్ వైపు ప్రయాణించే ప్రయాణికులకు గొప్ప ఉపశమనాన్ని అందిస్తోంది.
అసలు షెడ్యూల్ కంటే ఆలస్యమైన ఈ ప్రాజెక్టు అనుసంధానాన్ని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి, వేలాది మందికి రోజువారీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేయనుంది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చాలాకాలంగా ఆలస్యమైన బాచుపల్లి ఆరు లేన్ల ఫ్లైఓవర్ను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత అందుబాటులోకి వచ్చిన తొలి ఫ్లైఓవర్ బాచుపల్లి కాగా, 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ ఫ్లైఓవర్ 2024 నాటికి పూర్తి కావాల్సి ఉండగా, వివిధ కారణాల వల్ల ఇదీ తీవ్ర జాప్యాన్ని ఎదుర్కొంది. అయితే నాలుగేళ్ల విరామం తర్వాత, రియల్ ఎస్టేట్ విజృంభణ కారణంగా హైదరాబాద్ పశ్చిమ ప్రాంతాల తరహాలోనే వేగవంతమైన అభివృద్ధి చెందిన వెస్ట్ సిటీని కలపడంలో ఈ ఫ్లైఓవర్ కీలక పాత్రను పోషించనుంది.
తగ్గనున్న ట్రాఫిక్ రద్దీ..
నగరంలో మెరుగైన రవాణా సదుపాయాలను కల్పించే లక్ష్యంగా… కేసీఆర్ ప్రభుత్వం నగరంలో ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ క్రమంలో బాటిల్ నెక్ జంక్షన్లను గుర్తించి రూ. 10వేల కోట్లతో అభివృద్ధి చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోని కీలకమైన ప్రాజెక్టులను చేపట్టింది. దీనిలో భాగంగా మియాపూర్, నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్, బౌరంపేట్, మల్లంపేట్, గండిమైసమ్మ, గాజులరామారం వెంబడి ఉండే కాలనీలు, నివాస ప్రాంతాలతోపాటు, విద్యా సంస్థలకు రాకపోకలు సులభతరం కానుండగా, ప్రయాణ సమయం 20 నిమిషాల నుంచి 5-10నిమిషాలకు తగ్గింది. 1.3 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టును హెచ్ఎండీఏ రూ. 65.53 కోట్లను ఖర్చు చేయగా, కీలక ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో నగరాభివృద్ధిలో కేసీఆర్ ప్రణాళికలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
నగరంలో మెరుగైన రవాణా సదుపాయాలను కల్పించాలనే క్రమంలో దాదాపు రూ. 250 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందులో మూసీ రివర్ను ఆనుకుని, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెం. 18ఏ వద్ద రెండు వైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణానికి రూ. 229 కోట్లతో చేపట్టనున్నారు. అదే విధంగా నానక్రాంగూడ నుంచి గచ్చిబౌలి వెళ్లే మెయిన్ కాజ్వే విస్తరణ పనులను రూ. 26 కోట్లతో హెచ్ఎండీఏ-హెచ్జీసీఎల్ చేపట్టనుంది.