సిటీబ్యూరో, జూలై 31(నమస్తే తెలంగాణ): గ్లోబల్ సిటీగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరానికి మరో పౌర విమానయాన కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి అంతర్జాతీయ స్థాయి విమాన సేవలు అందుతుండగా.. నార్త్ సిటీ కేంద్రంగా రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ సెంటర్లో పౌర సేవలు ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రక్షణ శాఖతో సమన్వయం చేసుకుంటూ హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం జీఎంఆర్ ఎయిర్పోర్టు నుంచి ఏటా సుమారుగా 2.5 కోట్ల మంది విమాన సేవలను పొందుతుండగా.. వచ్చే ఐదేళ్లలో మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి తోడు ఫార్మా సిటీ, జీనోమ్ వ్యాలీ, విదేశీ పెట్టుబడులు, పారిశ్రామిక విధానాలతో నగర విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నది. ఎయిర్ కార్గో సేవలకు హైదరాబాద్ కేంద్రంగా మారుతుండగా అత్యంత రద్దీ ఎయిర్పోర్టుల జాబితాలో శంషాబాద్ నిలిచింది. ప్రస్తుతం హైదరాబాద్ విస్తరిస్తున్నట్లుగా నగరానికి రెండో ఎయిర్ పోర్టు అనివార్యంగా మారింది. దీనికి గోవా తరహాలో రక్షణ శాఖ ఎయిర్పోర్టులో విమాన సేవలు ప్రారంభించినట్లుగానే.. నగరంలోని హకీంపేట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ను వినియోగిస్తే విమాన సేవలు మరింత మెరుగుపడుతాయని ప్రభుత్వం భావిస్తున్నది. దీనికి హకీంపేట్ ఎయిర్పోర్టు నుంచి పౌర విమాన సేవలు ప్రారంభించేలా కేంద్రాన్ని కోరుతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. దీంతో ఈ నిర్ణయానికి కేంద్రం ఆమోదం తెలిపితే హైదరాబాద్ కేంద్రంగా రెండో పౌర విమానయాన కేంద్రం ఏర్పాటు కానున్నది.