సిటీబ్యూరో, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఆకలితో ఏ ఒక్కరూ అలమటించకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రూ.5 కే అన్నపూర్ణ పథకం ద్వారా ఇప్పటివరకు 10 కోట్ల 22 లక్షల మందికి రుచికరమైన భోజనం అందించారు. గ్రేటర్లో అమలు చేస్తున్న రూ.5 అన్నపూర్ణ భోజన పథకం నిరుపేదల ఆకలి తీర్చుతున్నది. 1 మార్చి, 2014న 8 కేంద్రాలతో ప్రారంభమైన ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 150 కేంద్రాలకు పెంచింది. ప్రతి కేంద్రం ద్వారా రోజుకు 300 భోజనాలు అందించాలన్న లక్ష్యంగా ఒక రోజుకు మొత్తం 45 వేల భోజనాలు అందిస్తున్నారు. 2014 నుంచి నవంబర్ 2022 వరకు 198 కోట్ల 43 లక్షల రూపాయలు ఖర్చు చేసి 10 కోట్ల 22 లక్షల 61వేల 922 మందికి రూ.5 లకే భోజనం అందజేశామని అధికారులు తెలిపారు. ప్రారంభ సంవత్సరంలో కేవలం 9 లక్షల 12 వేల 685 మందికి లబ్ధి చేకూర్చగా… ప్రతి సంవత్సరం ఆ సంఖ్య పెరిగిందని, ఖర్చుకు వెనుకాడకుండా పేదలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ కృషి చేసిందని అధికారులు చెప్పారు.
కరోనా సమయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ప్రభుత్వం మానవీయ కోణంతో ఆలోచించి ఉచితంగా భోజన వసతి కల్పించింది. జీహెచ్ఎంసీ మొత్తం శాశ్వతంగా ఉన్న కేంద్రాలతో కలిపి మొత్తం 373 కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా రాత్రి సమయంలో కూడా భోజనం అందించేందుకు 259 మొబైల్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పీరియడ్లో మొత్తం 2కోట్ల 29 లక్షల 46వేల 80 మందికి ఉచితంగా అందించినట్లు అధికారులు పేర్కొన్నారు.కేంద్రాల్లో కూర్చొని భోజనం చేసేందుకు మొత్తం 8 ప్రదేశాల్లో సీటింగ్ నిర్మాణాలు చేపట్టి అందుబాటులోకి తీసుకొచ్చారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు, ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందే వారి కుటుంబ సభ్యులకు టిఫిన్, భోజనానికి ఇబ్బంది పడకుండా సీఎం కేసీఆర్ భోజనం అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రూ.5 లకే మూడు ఫూటలా భోజనం అందిస్తున్నారు. ప్రతి రోజు మూడు పూటలకు సుమారు 8 వేలపైగా భోజనాలు అందించేందుకు టార్గెట్ పెట్టుకొని హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా అందజేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మే నెల నుంచి నవంబర్ వరకు రూ. 212.50 కోట్లు ఖర్చు చేసి 8 లక్షల9 వేల 530 భోజనాలు రూ. 5 కే అందించినట్లు అధికారులు పేర్కొన్నారు.