సిటీబ్యూరో, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ): పశు సంపదను వృద్ధి చేయడమే లక్ష్యంగా గచ్చిబౌలిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ సంస్థ సరికొత్త పరిశోధనలకు సిద్ధమైంది. బర్రెలు, పందులు, మేకలు, గొర్ల ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు అధ్యయనం చేస్తుండగా.. తాజాగా వాటికి వచ్చే రోగాలపై దృష్టి సారించింది. వైరస్, బ్యాక్టీరియాల కారణంగా వ్యాప్తి చెందే వ్యాధులను నియంత్రించడమే లక్ష్యంగా పరిశోధకులు దృష్టి సారించారు.
వ్యాధుల నిర్ధారణ, వ్యాక్సిన్ల రూపకల్పనకు..
పశు సంపదను గణనీయంగా పెంచే క్రమంలో ఆధునిక బయోటెక్నాలజీ విధానాలను అందుబాటులోకి తీసుకువస్తున్నది. పందులు, గొర్రెల పెంపకం దారులు తరుచుగా ఎదుర్కొనే బ్యాక్టీరియా, వైరస్లతో వచ్చే వ్యాధులతో తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. ముఖ్యంగా పొర్సిన్ సీర్కో, బ్రూసెల్లోసిస్ వంటి సూక్ష్మ జీవులతో వచ్చే ప్రమాదకర వ్యాధుల వ్యాప్తిని నియంత్రించడంపై దృష్టి సారించారు. వ్యాధుల నిర్థారణ, వ్యాక్సిన్ల రూపకల్పనకు ప్రాధాన్యతనిస్తూ పరిశోధనలు ముమ్మరం చేశారు.
యాంటి వైరల్ డ్రగ్స్ తయారీపై దృష్టి
డీఎన్ఏ వ్యాక్సిన్స్, ఆర్ఎన్ఏ థెరపీ, నానో డయాగ్నోస్టిక్స్, యాంటి వైరల్ డ్రగ్స్ తయారీపై దృష్టి సారించగా, బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవాలతో వచ్చే వ్యాధులను తట్టుకునేలా జన్యు మార్పిడి నూతన బ్రీడ్లను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం పొర్సిన్ సిర్కో వైరస్ వలన పందుల సంతతి తగ్గిపోతుండగా, ప్రత్యేక చికిత్స విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సంస్థ చేసిన పరిశోధనల ఫలితంగా మిజోరాంలో పైలట్ ప్రాజెక్టు ఫలితాలు సానుకూలంగా రావడంతోపాటు, పందుల్లో ఆ వ్యాధి వ్యాప్తి గణనీయంగా తగ్గినట్లుగా వెల్లడైంది. అదేవిధంగా పశువుల్లో సంక్రమించే తెలేరియా యాన్యులేటా వ్యాధి నిర్థారణకు మెరుగైన విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.