ప్రభుత్వం ఊహించినట్లుగా హైదరాబాద్ మహానగరం లాజిస్టిక్ హబ్గా మారుతున్నది. దేశం నలుమూలలా సరుకు రవాణా చేసేందుకు కేంద్ర బిందువుగా మారింది. అందుకు నిదర్శనం ప్రభుత్వ,ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) చేపట్టిన లాజిస్టిక్ పార్కులు మంచి పురోగతిని సాధిస్తున్నాయి. ముఖ్యంగా ఔటర్ రింగు రోడ్డు బొంగుళూరు ఇంటర్చేంజ్ పక్కనే ఉన్న మంగల్పల్లిలో 22 ఎకరాల విస్తీర్ణంలో ఆన్కాన్ లాజిస్టిక్ అనే ప్రైవేటు సంస్థ మొదట మూడు ఎకరాల విస్తీర్ణంలో లక్షా20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గోదాం (వేర్హౌస్)నిర్మాణాన్ని ఆధునిక సౌకర్యాలతో పూర్తి చేశారు.
ఎంతో ముందుచూపుతో హెచ్ఎండీఏ ఔటర్ రింగు రోడ్డు సమీపంలోనే 22ఎకరాల్లో మంగల్పల్లి లాజిస్టిక్ పార్కును ఏర్పాటు చేసింది. ఇక్కడ భవిష్యత్ అవసరాలకు సరిపడా స్థలం ఉండడంతో లాజిస్టిక్ పార్కును నిర్వహిస్తున్న ఆన్కాన్ సంస్థ 2వ గోదాంను సైతం నిర్మించాల్సి అవసరం ఉందని హెచ్ఎండీఏతో చర్చింది. దీనికి హెచ్ఎండీఏ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొత్తగా లక్ష చదరపు అడుగుల్లో 2వ గోదాం నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.మొదటి దశలోనే 22 ఎకరాల్లో లాజిస్టిక్ పార్కు అభివృద్ధి కోసం సుమారు రూ.20 కోట్ల వరకు ఆన్కాన్ లాజిస్టిక్ సంస్థ వెచ్చించింది. మళ్లీ రెండో గోదాం నిర్మాణానికి రూ.2-3 కోట్ల వరకు వెచ్చించనున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా సరుకు రవాణాకు గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు అత్యంత అనుకూలంగా ఉండడంతో లాజిస్టిక్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఔటర్ చుట్టూ అందుబాటులో స్థలాలు, రోడ్డు మార్గంతో పాటు ప్రభుత్వం పరంగా ప్రోత్సాహకాలు ఉండడంతో సరుకు రవాణా రంగం దినదినాభివృద్ధి చెందుతోంది.
ప్రైవేటు లాజిస్టిక్ పార్కులతో పోల్చితే హెచ్ఎండీఏతో కలిసి నిర్మించిన లాజిస్టిక్ పార్కుల్లో సకల సౌకర్యాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎండాకాలంలో కూడా వేడిమిని తట్టుకుని చల్లదనాన్ని ఇచ్చేలా ఇన్స్లేషన్ను ఏర్పాటు చేశారు. లక్షల టన్నుల సరుకులు ఇక్కడ నిల్వ ఉండేలా భారీ గోదాం , వంద మంది డ్రైవర్లు ఒకేసారి విశ్రాంతి తీసుకునేందుకు నాలుగు విశాలమైన గదులను నిర్మించారు. డ్రైవర్లు పడుకునేందుకు బెడ్లను కూడా ఏర్పాటు చేశారు. డ్రైవర్లకు మౌలిక వసతుల్లో భాగంగా టాయిలెట్లు, బాత్రూంలు నిర్మించారు. డ్రైవర్లు తమ సామానులను భద్రపరుచుకోవడానికి ప్రత్యేకంగా లాకర్ సౌకర్యాన్ని కల్పించారు.ఒకేసారి 250 ట్రక్కులు పార్కింగ్ చేసే సామర్థ్యం ఉండేలా స్థలం అందుబాటులో ఉండడంతో సరుకు రవాణా వృద్ధి రేటు క్రమంగానే పెరుగుతూ ఉంది.