మియాపూర్ , ఆగస్టు 19 : ఇద్దరికీ రెండో వివాహమే. అయినా కొంత కాలం తరువాత భర్త వేధింపులు తాళ లేక విడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో భర్త విదేశాలకు వెళ్లాడు. అయినా ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో అతడిపై భార్య కేసు నమోదు చేయించింది. దీంతో కోపం పెంచుకున్న భర్త.. భార్యతో పాటు ఆమె కుటుంబాన్ని మొత్తం మట్టుబెట్టాలని విషప్రయోగం చేశాడు. ఈ ఘటనలో బాధితురాలి తల్లి మృత్యువాత పడగా.. మరో నలుగురు తీవ్ర అస్వస్థతతో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. సంఘటనకు సంబంధించిన వివరాలను మియాపూర్ సీఐ ప్రేమ్కుమార్ శనివారం వెల్లడించారు. ముప్పవరకు శిరీష, అజీత్కుమార్లకు 2018లో పెద్దల సమక్షంలో ఆర్య సమాజ్లో వివాహం జరిగింది. శిరీష వైద్యురాలిగా.. అజీత్కుమార్ ఫార్మాసిస్టుగా పనిచేస్తూ గోకుల్ ప్లాట్స్లో ఉండేవారు. పైండ్లెన కొద్ది రోజుల నుంచే భార్యను వేధించసాగాడు. అంతలోనే యూకేకు వెళ్లిపోయాడు. బాగా చూసుకుంటానని మాయమాటలు చెప్పి భార్య శిరీషను యూకేకు రప్పించుకున్నాడు. అక్కడికి వెళ్లిన అనంతరం మళ్లీ వేధింపులకు గురి చేయడంతో ఆమె యూకేలో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. విడాకుల నోటీసును సైతం పంపింది. అప్పటినుంచి ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు.
ఈ క్రమంలో భార్యపై కక్ష్య పెంచుకున్న అజీత్ ఆమెతో పాటు ఆమె కుటుంబాన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. కాగా శిరీష సోదురుడు పూర్ణేందర్ వివాహం జూన్ 3, 2023 హైదరాబాద్లో ఉండటంతో మార్చిలోనే ఇక్కడికి వచ్చారు. పెండ్లి సమయంలోనే ఉప్పులో ఆర్సెనిక్ కలిపి శిరీష కుటుంబంపై విష ప్రయోగం చేశాడు. వివాహం అనంతరం శిరీష తల్లి, తండ్రి, సోదరుడు, మరదలు సహా మరో ఇద్దరు తీవ్రమైన వాంతులు, విరేచనాలతో దవాఖానలో చేరారు. శిరీష తల్లి ఉమామహేశ్వరి ఎల్బీనగర్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందింది. తర్వాత శిరీష తనకు వరుసకు కజిన్ అయ్యే గుంటూరుకు చెందిన శశిరేఖ వద్దకు వెళ్లింది. స్థానికంగా ఓ వైద్యుడికి తమ రిపోర్టులు చూపించగా ఆర్సెనిక్ ఫాయిజన్ ప్రయోగం జరిగినట్లు గుర్తించి శిరీషకు విషయాన్ని తెలిపాడు. పరిస్థితులను అంచనా వేసిన గోకుల్ ప్లాట్ వాచ్మన్ రమేశ్, మరో కజిన్ పూర్ణేందర్లపై అనుమానం రావటంతో ఇక్కడి మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీఐ నేతృత్వంలో పోలీసులు విచారణ చేపట్టడంతో శిరీష భర్త అజీత్కుమార్ కొందరి సహకారంతో ఫంక్షన్లో విషప్రయోగం చేసిన విషయం వెలుగు చూసింది. ఈ కేసులో నిందితులైన ఏడుగురిలో కీలకమైన అజీత్ పరారీలో ఉండగా.. మిగిలిన ఆరుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు మియాపూర్ సీఐ ప్రేమ్కుమార్ వెల్లడించారు.