సిటీబ్యూరో, సెప్టెంబర్ 8(నమస్తే తెలంగాణ): ట్రిపులార్ అగ్గి రాజుకుంటోంది. అడ్డగోలు అలైన్మెంట్ మార్పులతో భూములు కోల్పోతున్న వందలాది మంది రైతులు ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. జీవనాధారం పోతుందని జిల్లాలు దాటి నగరానికి చేరి ఆందోళనలకు దిగుతున్నారు. ఇదేదో ఒకరిద్దరూ అనుకుంటూ పొరపాటే. మెరుపు దాడిలా వందలాది మంది రైతులు పలు జిల్లాల నుంచి స్వచ్ఛందంగా వచ్చి తమ భూములు కాపాడుకునేందుకు గళమెత్తారు.
అక్కడితో ఆగిపోకుండా జాతీయ రహదారిని స్తంభింప జేశారు. దీంతో ఊహించని స్థాయిలో సాగిన ఆందోళనలతో అమీర్పేట స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులకు చిక్కకుండా రోడ్డెక్కిన రైతులతో హెచ్ఎండీఏ కార్యాలయానికి గట్టి సెగనే తగిలింది. ఇక రైతుల ఆందోళన విషయాన్ని ముందుగానే తెలుసుకున్న హెచ్ఎండీఏ ఉన్నతాధికారులేవరూ ప్రధాన కార్యాలయంలో లేరని తెలిసింది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తమ గోడును వినేవారు లేరని రైతులు ఆవేదన చెందారు.
రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ను ఆగస్టు నెలాఖరున అధికారిక వెబ్సైట్లో హెచ్ఎండీఏ ప్రదర్శించింది. ట్రిపులార్ వెళ్తున్న జిల్లాలు, ఆయా మండలాలల పరిధిలోని గ్రామాల సర్వే నంబర్ల వివరాలతో జాబితాను విడుదల చేసింది. దీంతో అభ్యంతరాలను ఎవరికీ చెప్పుకోవాలో తెలియక గడిచిన వారం రోజులుగా రైతులు ఆందోళన చెందుతున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఇన్నాళ్లు పోషించిన విలువైన భూములు దక్కేలా లేవని మదనపడుతున్నారు. ట్రిపులార్ భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం ఉదయం 11 గంటలకు హెచ్ఎండీఏ కార్యాలయాన్ని చేరుకున్నారు. ఉద్దేశపూర్వకంగా చేస్తున్న డైవర్ట్ రాజకీయాలకు రైతుల తీవ్ర ఆందోళనతో ప్రభుత్వానికి, హెచ్ఎండీఏ కమిషనర్కు సెగ తగిలింది.
నిజానికి కేంద్ర, రాష్ట్ర సర్కారు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుతో హెచ్ఎండీఏకు ఎలాంటి సంబంధం లేదనీ తెలిసింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మెప్పు కోసం కొంతమంది ఉన్నతాధికారులు ఆలైన్మెంట్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ను హెచ్ఎండీఏ అధికారిక వెబ్సైట్లో ఉంచారు. అమీర్పేటకు వచ్చిన వందలాది మంది రైతులకు అసలు ఆ వెబ్సైట్లో వివరాలను కూడా చూసుకునే వీల్లేకుండా ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఉండటంతో తీవ్ర ఆందోళనకు గురువుతున్నారు.
కనీసం ఎవరినీ సంప్రదించాలనే వివరాలు కూడా హెచ్ఎండీఏ వెబ్సైట్లో లేకపోవడంతో… వందల కిలోమీటర్ల దూరం నుంచి ఉదయాన్నే ఇక్కడకు వచ్చామని, అయినా కనీసం మా గోడు వినేవారు లేరని వాపోయారు. రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల నుంచి వచ్చిన వందలాది రైతులు బృందాలుగా తమ భూములను కాపాడాలంటూ కనిపించిన ప్రతి ఒక్క సిబ్బందిని కోరాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ ప్రాజెక్టుతో హెచ్ఎండీఏకు ఎలాంటి సంబంధం లేదని తెలిసి ఉన్నతాధికారులు మొత్తం సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు వెళ్లిపోయారు. కనీసం ఇక్కడకు వచ్చిన రైతులకు అయినా సరైన సమాచారంతో వివరణ ఇచ్చేవారు లేక నానా అవస్థలు పడ్డారు. ఆవేదనతో రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది.
సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు సరైన వివరణ ఇచ్చే వారు కరువైపోవడంతో ఆగ్రహాంతో వందలాది మంది రైతులు ప్లకార్డులతో అమీర్పేట్లోని జాతీయ రహదారిపై బైఠాయించారు. 20 నిమిషాల పాటు సాగిన రైతుల ఆందోళనను పోలీసులు పసిగట్టలేకపోయారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన పోలీసు యంత్రాంగం రైతులను సర్ధిచెప్పి ఆందోళన విరమించడానికి విశ్వప్రయత్నాలు చేశారు. ఉన్నతాధికారులు కూడా కలుగుజేసుకుని హెచ్ఎండీఏ ఉన్నతాధికారులను కలిసే ఏర్పాట్లు చేయడంతో రోడ్డుపై బైఠాయించిన రైతులు వెనక్కి తగ్గారు. కానీ ఆ లోపే నిరసన ప్రభావం అటు భరత్ నగర్ వరకు, ఇటూ పంజాగుట్ట దాటి నిమ్స్ వరకు విస్తరించింది.
దీంతో రెండున్నర గంటల పాటలు ఈ మార్గంలో ట్రాఫిక్ ఒక నరకంలా మారింది. జనాల ఆందోళనతో పోలీసులకే కళ్లు బైర్లు కమ్మినంత పనైపోయింది. వారిని నియంత్రించేందుకు తగినంత సిబ్బంది కూడా లేకపోవడంతో అప్పటికప్పుడు అదనపు సిబ్బందిని మోహరించుకోవాల్సి వచ్చిందనీ పోలీసుల వర్గాల ద్వారా సమాచారం తెలిసింది. ఈ స్థాయిలో వచ్చిన రైతులకు సమాధానం చెప్పలేక హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు కూడా కార్యాలయాలకు దూరంగా ఉండగా… కొంతమంది ఉన్నతాధికారులు ఆఫీసులోనే ఉండి తమకు సంబంధంలేనదీ రైతులను అనుమతించలేదు.
నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం లేకుండా, ఎవరికీ ఇవ్వాలా సమాచారం అందుబాటులో ఉంచకుండా రైతులను గందరగోళానికి కాంగ్రెస్ సర్కారు గురిచేస్తోంది. సమాచారం ఇచ్చే ఉద్దేశం లేనప్పుడూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ను పబ్లిక్ డొమైన్లో పెట్టడం ఎందుకనీ రైతులు మండిపడ్డారు.
అయితే కొంతమంది రైతుల నుంచి అధికారులు లిఖితపూర్వకంగా అభ్యంతరాలను స్వీకరించి తాత్కాలికంగా ఊరట కల్గించిన… సంబంధం లేని వ్యవహారంలో హెచ్ఎండీఏ ఎందుకు తలదూర్చిందనేది ఇప్పుడు రైతులకు అతిపెద్ద ప్రశ్నగా మారింది. గతంలో ఎప్పుడూ హెచ్ఎండీఏ అధికారులు ఈ ప్రాజెక్టు విషయంలో తమ వద్దకు రాలేదనీ, ఇప్పుడెందుకూ నోటిఫికేషన్ ప్రచురించారనీ, ప్రచురించిన నోటిఫికేషన్పై వివరణ ఎందుకు ఇవ్వడం లేదంటూ రైతులు ప్రశ్నించారు.