అంబర్పేట, డిసెంబర్ 6: అంబర్పేట నియోజకవర్గంలో తనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించిన వారందరికీ జీవితాంతం రుణపడి ఉంటానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. అలాగే పార్టీ మారుతారని వస్తున్న పుకార్లను కూడా ఎవరూ నమ్మొద్దని ఎమ్మెల్యే చెప్పారు. బాగ్అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ బి.పద్మావెంకటరెడ్డి, అంబర్పేట కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్, పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే బుధవారం మీడియాతో మాట్లాడారు. అంబర్పేటలో ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారని, 25వేల మెజార్టీ సామాన్యమైనది కాదన్నారు. ప్రజలు అభివృద్ధిని చూసి పాజిటివ్గా స్పందించి ఓట్లు వేశారని చెప్పారు. పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, ప్రజలు చాలా కష్టపడి తనను గెలిపించారని తెలిపారు.
మైనార్టీలు వంద శాతం బీఆర్ఎస్కు ఓటు వేశారని పేర్కొన్నారు. ఎక్కడకు వెళ్లినా బస్తీలు, కాలనీలో అందరూ ఆదరించారన్నారు. ఐదు సంవత్సరాలలో అందరిని కలుపుకొని సమన్వయంతో ముదుకు వెళ్తానని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ లు 2018లో తనకు టికెట్ ఇచ్చి గెలిపించారని, అలాగే రెండోసారి కూడా టికెట్ ఇచ్చి గెలిపించారన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయనని, పార్టీ మారుతున్నారనే పుకార్లను ఎవరూ నమ్మొద్దని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, మిర్యాల రవీందర్, మిర్యాల శ్రీనివాస్, గోవిందు అర్జున్, కెం చె మహేష్, నరహరి, బాలకృష్ణగౌడ్, అభిలాష్గౌడ్, రమణానాయుడు పాల్గొన్నారు.