మేడ్చల్, మార్చి20(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తున్నది. ఇందులో భాగంగా ప్రవేశపెట్టిన అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ఎస్సీ విద్యార్థులకు వరంగా మారింది. ఈ పథకం కింద మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నుంచి ఈ విద్యాసంవత్సరం 42 మంది విద్యార్థులు పై చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. దీనికి సంబంధించి ప్రభుత్వం రూ. 8.68 కోట్లను వెచ్చించింది. ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి ప్రతి ఏడాది 40 మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు వెళ్తున్నారు. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల నుంచి ఇప్పటి వరకు 280 మంది ఎస్సీ విద్యార్థులు పై చదువుల కోసం వెళ్లగా… రాష్ట్ర ప్రభుత్వం రూ.36 కోట్లు ఖర్చు చేసింది. ఈ విద్యా సంవత్సరంలోనే 42 మంది విద్యార్థులు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా దేశాలకు పై చదువులకు వెళ్లారు.
బీటెక్, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు విదేశాలకు వెళ్లే అర్హత సాధిస్తే అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ద్వారా ఎస్సీ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ ఎంపిక చేసి వారిని విదేశాలకు పంపిస్తుంది. విదేశాలకు వెళ్లేందుకు టోఫెల్, ఏజీఆర్ఈ, జీఆర్ఈ, ఐఎల్టీఎస్ పరీక్షల్లో అర్హత సాధించి, వివిధ దేశాలకు చెందిన వీసా పొందినట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థలో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం ఎంపిక చేసి విదేశాల్లో చదువుకునేందుకు అసరమయ్యే ఫీజును యూనివర్సిటీలకు నేరుగా ఆన్లైన్ ద్వారా ప్రభుత్వం చెల్లించనుంది. ఒక్కొక్క విద్యార్థికి రూ. 20 లక్షల చొప్పున చెల్లిస్తూ విమాన చార్జీలు, వీసా ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది.
నిరుపేదలకు ఈ పథకం బాగుంది. ఇప్పటికే అనేక మంది ఈ పథకం ద్వారా విదేశాలకు వెళ్లారు. అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు. నిరుపేదలు విదేశాల్లో చదివేందుకు వెళ్తున్నారంటే ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం వల్లే.
– అనీల్, అలియాబాద్, డిగ్రీ విద్యార్థి
ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంబేద్కర్ విదేశీ విద్యా పథకంతోనే విదేశాల్లో చదివే అవకాశం వచ్చింది. నాన్న ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు. ఆ సంపాదన కుటుంబ పోషణకు మాత్రమే సరిపోయేది. బీటెక్ పూర్తి చేసి విదేశాలకు వెళ్లేందుకు అర్హత సాధించి ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం రూ. 20 లక్షలను మంజూరు చేసింది. ప్రసుత్తం యూకే లో ఎంఎస్ చదువుకుంటున్నా. నాలాంటి అనేక మందికి విదేశాల్లో చదివే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– అనూష, మేడ్చల్
విదేశాలకు వెళ్లేందుకు అర్హత సాధించే టోఫెల్, ఏజీఆర్ఈ, జీఆర్ఈ, ఐల్టీఎస్లో శిక్షణ పొందే ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా శిక్షణ అందించే విధంగా చర్యలు తీసుకుంటుంది. శిక్షణ పొందే విద్యార్థులకు రూ. 12 వేల చొప్పున ఒక్కొక్కరికి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. శిక్షణ పొందేందుకు అసక్తి ఉన్న విద్యార్థులు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థను సంప్రదిస్తే వివరాలు అందిస్తాం. ప్రభుత్వం అన్ని రకాల అవకాశాలను కల్పిస్తూ అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని ప్రవేశపెట్టింది.
– వినోద్ కుమార్, షెడ్యూల్డ్ కులాల
అభివృద్ధి అధికారి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా
నిరుపేదలు విదేశాల్లో చదువుకోవచ్చనే నమ్మకం ఏర్పడింది. టాలెంట్ ఉంటే ఈ పథకం ద్వారా విదేశాల్లో చదివే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఒక్క పైసా ఖర్చు లేకుండా విమాన చార్జీలు, వీసా చార్జీలను ప్రభుత్వమే భరించి విదేశాలకు పంపించడం సంతోషంగా ఉంది.
– మాధవి,లాల్గడి మలక్పేట్, డిగ్రీ విద్యార్థి