ఖైరతాబాద్, సెప్టెంబర్ 15 : పార్టీలోకి ఆహ్వానించి చేర్చుకోకుండా అవమానపరిచిన బీజేపీని ఆర్యవైశ్యులు విస్మరిస్తారని తెలంగాణ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం ఖైరతాబాద్ చింతలబస్తీలోని ఆర్యవైశ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చికోటి ప్రవీణ్ విషయంలో బీజేపీ అనుసరించిన వైఖరిని ఖండించారు. ఆర్యవైశ్యులను బీజేపీ చిన్న చూపు చూస్తున్నదని, ప్రవీణ్ కుమార్ను బీజేపీలోకి చేర్చుకునేందుకు తొలుత అపాయింట్మెంట్ ఇచ్చిన ఆ పార్టీ అధినాయకత్వం, లక్షలాది రూపాయలు పెట్టి హోర్డింగ్లు ఏర్పాటు చేసుకొని వేలాది మందితో నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి వెళితే ఎవరూ పట్టించుకోకుండా అవమానించారన్నారు. ఇది కేవలం చికోటికి జరిగిన అవమానం కాదని, రాష్ట్రంలోని ఆర్యవైశ్యులందరికీ జరిగినదిగా భావిస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలోనే చికోటిని ఆ పార్టీలోకి అహ్వానించారని, ఉద్దేశపూర్వకంగానే అవమానించారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో సరైన బుద్ది చెబుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్య మహాసభ ఆర్గనైజింగ్ సెక్రటరీ గణేశ్గుప్తా, కోశాధికారి కొండ్లె మల్లికార్జున్, నాయకులు చింతల రవికుమార్, మొగుళ్లపల్లి ఉపేంద్ర, కుమారస్వామి, సామ్రాజ్యలక్ష్మి, ఆగిరి వెంకటేశ్, ఉప్పల చంద్రశేఖర్ గుప్తా, పాల్గొన్నారు.