అణు ఇంధన శాస్త్రవేత్త డాక్టర్ కకోడ్కర్ వెల్లడి
ఘనంగా ఎన్ఎఫ్సీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు
చర్లపల్లి, జూన్ 8: సంప్రదాయ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా అణు ఇంధనాన్ని సమకూర్చే సామర్థ్యం న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (ఎన్ఎఫ్సీ)కే ఉన్నదని భారత అణుఇంధన కమిషన్ సభ్యుడు, శాస్త్రవేత డాక్టర్ అనిల్ కకోడ్కర్ పేర్కొన్నారు. అణు ఇంధన రంగంలో ఎన్ఎఫ్సీ ప్రపంచంలోనే అగ్రగామని అని చెప్పారు. ఎన్ఎఫ్సీ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా డీఏఈ కాలనీలోని డాక్టర్ హోమిబాబా కన్వెన్షన్ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో పరికరాలను తయారు చేయడంతోపాటు అణు ఇంధన రంగంలో రక్షణ రంగానికి రావాల్సినవి అందించడంలో ఎన్ఎఫ్సీ ముందున్నదని చెప్పారు.
ఎన్ఎఫ్సీ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి డాక్టర్ దినేశ్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. ఎన్ఎఫ్సీలో గత నాలుగేండ్లుగా నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించి ఉత్పత్తి చేశామని చెప్పారు. ఉద్యోగులు, కార్మికుల భాగస్వామ్యంతో మరిన్ని విజయాలు సాధించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గడిచిన 50 సంవత్సరాలుగా ఎంతో ప్రగతిని సాధించామని, ఇప్పుడు లాభాలను ఆర్జిస్తున్నామని చెప్పారు.అనంతరం 2021-22సంవత్సరంలో ఎన్ఎఫ్సీ సాధించిన విజయాలు, ఉత్పత్తుల వివరాలతో రూపొందించిన గోల్డెన్ జూబ్లీ ఎన్ఎఫ్సీ హైలైట్స్ బుక్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్సీ ఏసీఈ డీ ప్రమాణిక్, డీసీఈ కోమల్ కపూర్, డీసీఈ విజయరాఘవన్, డైరెక్టర్ ఏఎండీ డాక్టర్ డీకే సిన్హా, ఈసీఐఎల్ సీఎండీ రేర్ అడ్మిరల్ సంజయ్ చౌబే రిటైర్డ్లతోపాటు ఎన్ఎఫ్సీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.