సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ ) : బీఆర్ఎస్ దూకుడు ముందు ప్రతిపక్షాలు డీలా పడుతున్నాయి. ఓ వైపు కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థులను ప్రకటించడానికి జంకుతుంటే మరోవైపు ఈ పార్టీలతో సీపీఐ, జనసేన పొత్తుల విషయంపై చర్చలు సాగుతున్నాయి. అందులో భాగంగానే కమలం పార్టీ- జనసేన పొత్తు దాదాపు ఖరారైనట్టు పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం. తాజాగా పవన్ కల్యాణ్ ఢిల్లీ బయలుదేరి అమిత్షాను కలవడం పొత్తుకు సంకేతంగా కనిపిస్తోంది. అయితే బీజేపీ-జనసేన పొత్తు ప్రధానంగా గ్రేటర్ పరిధిలోనే ఉండనుందని సమాచారం.
ఈ లెక్కన ఐటీ కారిడార్లో కొన్ని సీట్లు జనసేనకు బీజేపీ కేటాయించనుందని ఆ పార్టీ నాయకుల విశ్వసనీయ సమాచారం. దీంతో ఆ నియోజకవర్గాల బీజేపీ ఆశావహులు నైరాశ్యంలో మునిగిపోయారు. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల నుంచి పదుల సంఖ్యలో ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పొత్తుపై ఢిల్లీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే తమ భవిష్యత్తు ఏంటని బీజేపీ ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. ఏండ్ల నుంచి పార్టీ కోసం కష్టపడ్డామని అన్యాయం జరిగితే పార్టీలో ఉండబోమని నాయకులు చర్చించుకుంటున్నారు. అతీగతీలేని జనసేనతో పొత్తు కన్న స్వతహాగా బరిలో దిగితేనే డిపాజిైట్లెనా దక్కుతాయని ఆ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. అధికార పార్టీ అభివృద్ధి నమూనాతో ఇప్పటికే గెలుపు ఖాయం చేసుకున్న పరిస్థితులు నియోజకవర్గాల్లో కనిపిస్తున్నాయని.. అభ్యర్థుల ఖరారులో ఆలస్యం చేస్తే పార్టీకి మరింత డ్యామేజీ చేకూరుతుందని ఢిల్లీ నాయకత్వంపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.