ఖైరతాబాద్, ఆగస్టు 14 : ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపునిచ్చారు. పర్యావరణ హితమే లక్ష్యంగా గ్లోబల్ ఎకో మార్ట్ సంస్థ రూపొందించిన ఉత్పత్తులను శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ముఖ్యఅతిథులుగా అల్లం నారాయణ, కవి, గాయకుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ప్రముఖ చిత్రకారులు, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు ఎంవీ రమణారెడ్డి హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ పర్యావరణం ప్రమాదకర స్థితిలో ఉందన్నారు. ప్రస్తుతం అడవులు హరించుకుపోవడం, వాతావరణ సమతుల్యత దెబ్బతినడం, గ్లోబల్ వార్మింగ్ పరిస్థితుల నుంచి బయట పడాలంటే తమ వంతు బాధ్యతగా ప్లాస్టిక్ ఉత్పత్తులను విడనాడాలన్నారు. గోరటి వెంకన్న మాట్లాడుతూ పర్యావరణ అనుకూల ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఎకో గ్లోబల్ మార్ట్ వ్యవస్థాపకుడు అమన్కుమార్, ఫౌండర్ గోపాల్ పేర్కొన్నారు.