కుత్బుల్లాపూర్,జనవరి17: రాబోయే వర్షాకాలం నాటికి అభివృద్ధి పనులు పూర్తి కావాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోడ్లు, నాలాలు, శ్మశానవాటికల అభివృద్ధిపై సోమవారం పేట్ బషీరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ, వాటర్వర్క్స్, ఇరిగేషన్ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో జీహెచ్ఎంసీ పరిధిలోని ఫాక్స్సాగర్ నాలా, కోల్ నాలాల అభివృద్ధి పనులతో పాటు శ్మశానవాటికల అభివృద్ధి, పలు బస్తీలు, కాలనీల్లో దెబ్బతిన్న రోడ్లు, భూగర్భ డ్రైనేజీ అభివృద్ధి పనులు, చెరువుల సుందరీకరణ వంటి అనేక అంశాలపై కూలంకుషంగా అధికారులతో చర్చించారు. ఎస్ఎన్డీపీ నిధులతో చేపడుతున్న ఫాక్స్సాగర్ నాలా, కోల్ నాలా అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలన్నారు. వర్షాకాలానికి ముందే పనులన్నీ పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలని పలు సూచనలు ఇచ్చారు. దీంతో పాటు శ్మశానవాటికల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వ్యయ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో ఎస్ఈ చెన్నారెడ్డి, ఈఈ కృష్ణచైతన్య, డీఈలు శిరీష, పాపమ్మ, రమేశ్, ఇరిగేషన్ డీఈ నరేందర్, ఏఈ రామారావు, ఏఈలు సురేందర్నాయక్, మల్లారెడ్డి, సంపత్, కల్యాణ్, సతీశ్, ఆశ ఉన్నారు.