ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేని విధంగా… రోజు 10వేల మెట్రిక్ టన్నుల చెత్త వేయడం దారుణమని, ప్రజల ప్రాణాలతో రాంకీ చెలగాటమాడుతోందని అఖిల పక్షం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జవహర్నగర్ పరిసర ప్రాంతాలలో గాలి పీల్చలేని.. నీరు తాగలేని దుస్థితిలో ప్రజలు కాలం వెల్లదీస్తుంటే పట్టించుకోకపోవడమేమిటీ అంటూ అఖిలపక్షం నాయకులు ముక్తం కంఠంతో ఖండించారు. మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం డంపింగ్యార్డ్లో అఖిలపక్ష నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్తో పాటు రాంకీ ప్రతినిధులు, డంపింగ్ జేఏసీ నేతలు, జవహర్నగర్, దమ్మాయిగూడ, కీసర మండల నాయకులు పాల్గొని డంపింగ్యార్డ్ వల్ల ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. రాంకీ అనుసరిస్తున్న వ్యర్థ నిర్వహణ విధానాలు, కాలుష్య నియంత్రణ చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. జవహర్నగర్ ప్రాంతంలో నీటి కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన ఎస్టీపీ ప్లాంట్ సక్రమంగా పనిచేయకపోవడంపై ప్రజాప్రతినిధులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రాంకీ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల మంది ఆరోగ్యం గాల్లో కలిసిపోతుందని, ఇప్పటికే పశుసంపద, వాతావరణంలో సమతూల్యత లోపించిందని అఖిలపక్షం నాయకులు విమర్శించారు.
– సిటీబ్యూరో/జవహర్నగర్ , మే 22 (నమస్తే తెలంగాణ)
ప్రాణాలతో చెలగాటమా? సిటీబ్యూరో/జవహర్నగర్ , మే 22 (నమస్తే తెలంగాణ): చెత్త సేకరణ చేస్తున్న రాంకీ సంస్థ ప్రతిరోజు వచ్చే చెత్తలో సగం కూడా రీసైక్లింగ్ చేయడం లేదని, గుట్టలుగుట్టలుగా చెత్త పేరుకుపోతుందని అఖిలపక్షం నాయకులు దుయ్యబట్టారు. డంపింగ్యార్డ్ను ఎత్తివేయాలని జేఏసీ నాయకులు పోరాటాలు చేస్తున్న తప్పుడు నివేదికలతో రాంకీ ప్రభుత్వాన్ని తప్పుదోవపట్టిస్తుందన్నారు. సీఎం రేవంత్రెడ్డికి డంపింగ్యార్డ్పై పూర్తిస్థాయి అవగాహన ఉందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. హైదరాబాద్ చుట్టూ డంపింగ్యార్డ్లు ఏర్పాటు చేస్తే ఈ సమస్య ఉండదన్నారు.
రాజకీయాలతో సంబంధం లేకుండా శాశ్వత పరిష్కారం చూపి ప్రజల ప్రాణాలను కాపాడాలన్నారు. రాంకీ ప్రతినిధులు పూర్తిస్థాయి నివేదికను తీసుకుని మరో వారం రోజుల్లో ముఖ్యమంత్రిని కలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి కమిషనర్ సీపీ సుమతి, డీసీ వసంత, మాజీ మేయర్లు కావ్య, శాంతి, మాజీ డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ ర్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ శంకర్గౌడ్, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్యాదవ్, నాయకులు శ్రీకాంత్యాదవ్, సదానంద్, విక్రమ్రెడ్డి, సుదర్శన్రెడ్డి, మహేందర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రస్తుతం మూడు మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి రోజుకు సుమారు 10వేల మెట్రిక్ టన్నుల చెత్త జవహర్నగర్ డంప్యార్డుకు తరలివస్తుండడంతో సమస్య తీవ్రంగా మారిందని, ఇందుకు ప్రత్యామ్నాయంగా నగరానికి నాలుగు వైపులా కొత్త డంప్ యార్డలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీఎస్ఆర్ నిధులను స్థానిక ప్రజల అభివృద్ధికి వినియోగిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని సూచించారు. చాలా తక్కువ మొత్తంలోనే సీఎస్ఆర్ నిధులు ఖర్చు చేస్తున్నారని, ప్రజలకు తాగునీరు, సరైన వైద్య సదుపాయాలు అందడం లేదని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, రాంకీ సంస్థ ప్రతినిధులు కలిసి మరోసారి సమావేశమై సమగ్ర నివేదికను సిద్దం చేసి సీఎం రేవంత్రెడ్డికి నివేదిక సమర్పించాలని నిర్ణయించారు.
జవహర్నగర్ డంపింగ్ యార్డ్ మోసం.. నరరూప రాక్షసుడిగా రాంకీ వ్యవహరిస్తున్నది. నేను మంత్రిగా ఉన్నప్పుడు రాంకీ సంస్థ పద్ధతిగా నడుచుకున్నది. మాజీ మంత్రి కేటీఆర్తో కలిసి కోట్లాది రూపాయాలు కేటాయించి.. ప్రజలకు దుర్వాసన రాకుండా చేశాం. 500 కోట్లతో విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు, 250 కోట్లతో లిచెట్ ట్రిట్మెంట్, 144కోట్లతో చెత్తను క్యాపింగ్ చేశాం. దేశమంతాట రాంకీ సంస్థ నడుస్తున్నది. హైదరాబాద్లో మాత్రమే ఇలా చేయడమేమిటి. సమావేశాలు ఏర్పాటు చేయడం కొత్తేమీ కాదు. శాశ్వత పరిష్కారం చూపాలి.
-ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి