చిక్కడపల్లి, జూలై 13: కేంద్ర ప్రభుత్వం కార్పొరేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తామని అఖిల భారత కిసాన్ సభ జాతీయ కోశాధికారి పి.కృష్ణ ప్రసాద్ అన్నారు. కిసాన్ సభ రెండు రోజుల ఆలిండియా వర్క్షాప్ సందర్భంగా బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్తో కలిసి ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని నీరుగార్చేందుకు పూనుకుంటున్నదని, సహజ వనరులు, అటవీ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నదని మండిపడ్డారు.
దేశ వ్యాప్తంగా 30 శాతానికి పైగా వ్యవసాయం కౌలు రైతుల ద్వారా జరుగుతున్నదని, వారికి కనీస హక్కులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పంటల వారీగా రైతులను సమీకరించేందుకు ఏఐకేఎస్ జాతీయ స్థాయిలో ప్రయత్నిస్తున్నదన్నారు. వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్రం ప్రయత్నించడం లేదన్నారు. విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షుడు సారంపలి మల్లారెడ్డి, కేంద్ర నాయకులు కేశవ రావు, గోపి, యశంత్ బాబూలాల్ యాదవ్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరిబండి ప్రసాద్రావు, శోభన్, లెల్లెల బాలకృష్ణ, వివిధ రాష్ర్టాల రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.