సాగర తీరంలో పచ్చని పూదోట పర్చుకున్నది. వేలాది మొక్కలు, పుష్పజాతులు ప్రకృతి వనాన్ని తలపిస్తున్నాయి. తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో పీవీ నరసింహారావు మార్గ్లోని పీపుల్స్ప్లాజా వేదికగా గురువారం ప్రారంభమైన 10వ గ్రాండ్ నర్సరీ మేళా (ఆల్ ఇండియా హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ షో) ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్నది. సుమారు 140 స్టాళ్లలో వేలాదిగా కాక్టస్, సక్యూలెంట్స్, బోన్సాయ్, అడేనియం, ఇండోర్, ఔట్డోర్, ఆక్సిజన్, ఔషధ మొక్కలను అందుబాటులో ఉంచారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని అనేక రాష్ర్టాల నుంచి ఇక్కడికి విలువైన, అరుదైన మొక్కలను ఇక్కడ ఉంచారు. ఈ నెల 23 వరకు ప్రతిరోజు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతున్నదని తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్స్ నిర్వాహకుడు ఖలీద్ అహ్మద్ తెలిపారు.
కరోనా వేళ ఔషధ మొక్కలపై ప్రజలకు అవగాహన పెరిగింది. ప్రగతి రిసార్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆరోగ్యాన్నిచే వందలాది ఔషధ, సుగంధ, దేశీయ వంగడాలు ప్రదర్శగా ఉంచారు. ప్రధానంగా తులసీ, సదాపాకు, ఇన్సూలిన్, మాస్కిటో రిపల్లెంట్తో పాటు బ్రహ్మకమలం, రుద్రాక్ష లాంటి అరుదైన మొక్కలను సైతం అందుబాటులో ఉంచారు. ప్రగతి సుధామాలో సుమారు 600లకు పైగా అరుదైన మొక్కలు, వెయ్యికి పైగా ఔషధ మొక్కలున్నట్లు హార్టికల్చర్ సీనియర్ మేనేజర్ డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు.
నర్సరీ మేళాలో బోన్సాయ్ మొక్కలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అందులో ఆక్సిజన్, ఇండోర్, ఔట్డోర్ మొక్కలను అందుబాటులో ఉంచారు. సుచిత బోన్సాయ్ స్టాల్లో కేవలం సాధారణ మొక్కలే కాకుండా మామిడి పండు, నిమ్మ, బత్తాయి, మిరప తదితర పండ్ల రకాలు సైతం మరుగుజ్జు రూపంలో ఉన్నాయి. కేవ లం ఒక్క అడుగు పెరిగిన బోన్సాయ్ మామి డి, నిమ్మ చెట్లకు పండ్లు, కాయలు కాయడం ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తున్నది. తమ వద్ద రూ.2 వేల నుంచి 2లక్షల విలువైన బోన్సాయ్ మొక్కలు ఉన్నాయని నిర్వాహకుడు ఈశ్వర్ తెలిపారు.
ఖైరతాబాద్, ఆగస్టు 19 : పీవీ నరసింహారావు మార్గ్ పీపుల్స్ప్లాజా వేదికగా ఏర్పాటు చేసిన గ్రాండ్ నర్సరీ మేళాలో ఓ సీతాకోక చిలుక పుష్పాలను ఆస్వాదిస్తూ కనిపించింది. వేలాదిగా రకాల మొక్కలతో ఆ ప్రాంతం వనంగా మారగా, పక్షులు, సీతాకోక చిలుకలు మొక్కలపై వాలి పులకరించాయి.
ప్రస్తుతం నగరాలు, పట్టణాలు కాంక్రీట్ జంగిల్గా మారడంతో పాటు కాలుష్యంగా విపరీతంగా పెరిగింది. అర్బన్ గార్డెన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో వందలాదిగా ఎయిర్ప్యూరిఫయర్, ఆక్సిజన్ మొక్కలైన సాన్సివీరియాస్, కలాతియా, బాంబు పామ్స్, పోతోస్, జీజీ, గ్రాఫ్టెడ్ కాక్టస్ తదితర జాతులను అందుబాటులో ఉంచారు. తమ వద్ద వందలాదిగా ఇండోర్, ఎయిర్ప్యూరిఫయర్ మొక్కలతో పాటు దక్షిణ భారతదేశంలో మొదటి పెబ్బెల్స్ తయారీ కేంద్రాన్ని స్థాపించామని అర్బన్ గార్డెన్స్ డైరెక్టర్ ఘర్షామ్ దొడ్డ తెలిపారు.
గ్రాండ్ నర్సరీ మేళాలో ఓ మొక్క ప్రత్యేకంగా కనిపిస్తున్నది. కాక్టస్ జాతికి చెందినదని చెబుతుండగా, దీని శాస్త్రీయ నామం యుఫోర్బియా. ఈ జాతికి చెందిన ఆ మొక్క పూర్తిగా ముళ్ల మాదిరిగానే కనిపిస్తుంది. షిర్డీ నుంచి ఈ మొక్కను తెప్పించినట్లు నిర్వాహకుడు తెలిపాడు.
నీటిలో పెరిగే తామర పుష్పాలకు వేలాది సంవత్సరాల చరిత్ర ఉంది.పూర్వం చెరువులు, కుంటల్లో కనిపించే ఈ మొక్కలు ప్రస్తుతం అరుదుగా మారాయి. వీటిని ప్రత్యేకంగా పూజల్లో సైతం వినియోగిస్తున్నారు. ఒక్కో రకమైన తామర మొక్కలు సుమారు రూ.1,500 వరకు విక్రయిస్తున్నారు. వీటితో పాటు శివునికి ప్రీతిపాత్రమైన బిల్వ ప్రతం మొక్కలు ఇక్కడ అందుబాటులో ఉంచారు.